వైట్హౌస్ నుంచి తరిమేస్తాం!
ABN, First Publish Date - 2020-11-07T07:07:31+05:30
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేత జో బైడెనేనని దాదాపుగా తేలిపోయింది. దేశ 46వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది...
- బైడెన్ శిబిరం తీవ్ర వ్యాఖ్యలు
- పెన్సిల్వేనియా, జార్జియాల్లో బైడెన్ జోరు
- అరిజోనా, నెవాడా కూడా ఆయనకే..!
- ట్రంప్లో పెరిగిన అసహనం
- జార్జియాలో రీకౌంట్కు ఆదేశం
- స్వింగ్ రాష్ట్రాల్లో రిగ్గింగ్ ఆరోపణ
- అసత్యాలతో దాడి..
- అడ్డంగా కట్ చేసిన న్యూస్ చానెల్స్
- బైడెన్కు భద్రత పెంపు
- కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
వాషింగ్టన్, నవంబరు 6: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేత జో బైడెనేనని దాదాపుగా తేలిపోయింది. దేశ 46వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 538 ఓట్లున్న ఎలక్టోరల్ కాలేజీలో మేజిక్ ఫిగర్ 270కి చేరువగా గురువారమే వచ్చేసిన ఆయన మరో రెండు స్వింగ్ రాష్ట్రాలు- జార్జియా, పెన్సిల్వేనియాల్లో ముందంజలోకొచ్చేశారు. ఆధిక్యం స్వల్పమే అయినా లెక్కింపు సరళి ఆయనకే విజయాన్ని అందించేట్లుంది. ముఖ్యంగా 20 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాను గనక గెలిచేస్తే పీఠం ఆయనదే. ప్రస్తు తం బైడెన్-ట్రం్ప 264-213 తేడాలో ఉన్నారు.
లెక్కింపు పూర్తి కానందున సీఎన్ఎన్లాంటి ఒకట్రెండు చానెళ్లు ఇంకా బైడెన్కు 253 ఓట్లే ఉన్నట్లు చూపుతున్నాయి. ఒకవేళ పెన్సిల్వేనియా గెలిస్తే- బైడెన్ లీడ్ 270 సం ఖ్యను దాటిపోతుంది. ఇవే కాక- జార్జియాలో కూడా ఆధిక్యంలోకొచ్చారు. అయితే ఆధిక్యత 1096 ఓట్లు మా త్రమే. ఇది సంప్రదాయకంగా రిపబ్లికన్ కంచుకోట. ఇది చేజారుతోందని గ్రహించిన రిపబ్లికన్లు అక్కడ రీకౌంట్ కోరారు. ఇద్దరి మధ్యా తేడా 0.5 శాతం కంటే తక్కువ ఉంటే రీకౌంట్కు అక్కడి చట్టాలు అనుమతిస్తాయి. అదీకాక- జార్జియా గవర్నర్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు. ఆయన రీకౌంటింగ్కు అనుమతించినట్లు ముఖ్య అధికారి బ్రాడ్ రాఫెన్స్పెర్జర్ ప్రకటించారు. సైనిక దళాలతో పాటు ఇతర పోస్టల్ ఓట్లు రావడానికి శుక్రవారం సాయంత్రం దాకా గడువుంది. వాటిని శనివారం లెక్కిస్తారు. వాటిలో ఎక్కువ భాగం బైడెన్కే వెళ్లొచ్చన్నది అంచనా. ఇక నెవాడా, అరిజోనాల్లోనూ బైడెన్దే ఆధి క్యం. మొత్తం మీద- 4 స్వింగ్ రాష్ట్రాల్లో బైడెన్ దూసుకెళుతున్నారు. నార్త్ కరోలినాలో మాత్రం ట్రంప్ ఆధిక్యం లో ఉన్నారు. అయితే ఇదొక్కటీ చాలదు కాబట్టి ఆయన శ్వేతసౌధాన్ని వదలిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
పోరాటానికే ట్రంప్ నిర్ణయం!
వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -ఓటమిని అంగీకరించడానికి సుముఖత చూపలేదు. శుక్రవారంనాడు తన సహాయకులు, సలహాదార్లు, పార్టీ నేతలతో సమావేశమై ఆయన అన్ని అంశాలనూ చర్చించారు. ఓటమిని ఒప్పేసుకోవడం మంచిదని, హుందాగా ఉంటుందని కొందరు సూచించగా- మిగిలిన వారు కోర్టుల్లో గట్టిగా పోరాడదామని అభిప్రాయపడ్డారు. ఓటమిని ఒప్పుకునే ప్రసంగం ఆయన చేయకపోవచ్చని, ఆ బాఽధ్యతను సలహాదార్లయిన తన కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జేడ్ కుష్నర్కు అప్పగించవచ్చన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన ట్రంప్- ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ’మేం కోరుతున్నది నిజాయితీ అయిన పోలింగ్, నిజాయితీ ఉన్న సిబ్బందితో నిజాయితీగా ఓట్ల లెక్కింపు. అప్పుడే అమెరికా గెలుస్తుంది. ప్రజాభిప్రాయానికి పట్టం కట్టినట్లవుతుంది. ఇది జరగలేదు. పోలింగ్ జరిగాక వచ్చిన ఓట్లను అనుమతించడమేంటి? ఇది చట్టవిరుద్ధం. ఫార్స్ . లీగల్ ఓట్లనే లెక్కించాలి.
ఎన్నికల్ని దొంగిలించడానికి డెమాక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. మీడియా అంతా వారి కి అనుకూలంగా మారింది. సాంకేతిక సంస్థలూ వారికే మద్దతు(బిగ్ మనీ- బిగ్ మీడియా- బిగ్ టెక్). ఈ పరిస్థితుల్లో నిజాయితీకి, చిత్తశుద్ధికి స్థానమెక్కడ? మేం ఇప్పటికే అరిజోనా, విస్కాన్సన్ల్లో గెలిచేశాం. అయినా బైడెన్ లీడ్లో ఉన్నట్లు చూపుతున్నారు’ అంటూ అసత్యాలతో దాడికి దిగారు. ట్రంప్ మాటలు దేశప్రతిష్ఠను, ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను దెబ్బతీసేట్లున్నాయని భావిస్తూ- ఏబీసీ, ఎన్బీసీ, అనేక ఇతర జాతీయ చానెళ్లు ఆయన ప్రసంగ ప్రత్యక్షప్రసారాన్ని మధ్యలోనే కట్ చేసేశాయి. సీఎన్ఎన్ కూడా చివర్లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ను కట్ చేసింది. న్యూయార్క్ టై మ్స్దీ అదే బాట. ఈ ఎన్నికలపై పూర్తి స్థాయి యుద్ధానికి ట్రంప్ వెళ్లనున్నారని ఆయన కుమారుడు ట్వీట్ చేశారు.
ప్రతీ ఓటూ పవిత్రమే: బైడెన్
ట్రంప్ మాటలు విన్న జో బైడెన్ శిబిరం తీవ్రంగా స్పందించింది. ‘‘ఎన్నికల్లో విజేతను నిర్ణయించేది అమెరికన్ ప్రజలేనని జూలై 19నే మేం చెప్పాం. అదే జరుగుతోంది. దీన్ని గమనించక వైట్హౌ్సలో అనుమతి లేకుండా ప్రవేశించిన వారిని బయటకు పంపేసే సత్తా ప్రభుత్వానికి ఉంది’’ అని ట్రంప్నుద్దేశించి బైడెన్ ప్రచార కమిటీ ముఖ్య ప్రతినిధి ఆండ్రూ బేట్స్ ఘాటు గా అన్నారు. ‘ప్రజాస్వామ్యం కొంతవరకూ గజిబిజే. దీనికి ఓర్పు కావాలి. 240 ఏళ్లుగా ఇలాంటి ఓర్పే ఈ గొ ప్ప దేశాన్ని నడిపించింది. మనమంటే ప్రపంచ దేశా లు అసూయపడేట్లు చేసింది. ఈ దేశంలో ప్రతీ ఓటూ పవిత్రమైనది. కౌంటింగ్ పూర్తవ్వాలి. మేం గెలుపొందామన్న ప్రకటన వెలువడుతుందన్న నమ్మకం ఉంది’’ అని బైడెన్ డెలావర్లో పేర్కొన్నారు. మరోవైపు.... అధ్యక్ష పీఠానికి బైడన్ అతి సమీపంలోకి వచ్చేయడంతో ఆయనకు భద్రతను పెంచారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రంగంలోకి దిగారు.
Updated Date - 2020-11-07T07:07:31+05:30 IST