పీపీఈ కిట్ల ఎగుమతిపై నిషేధం తొలగించాలి : ఇండియన్ అపారెల్ ఇండస్ట్ర్రీ
ABN, First Publish Date - 2020-06-21T20:40:58+05:30
ఇండియన్ అపారెల్ ఇండస్ట్రీ భారీ వ్యూహంతో ముందుకు వచ్చింది.
న్యూఢిల్లీ : ఇండియన్ అపారెల్ ఇండస్ట్రీ భారీ వ్యూహంతో ముందుకు వచ్చింది. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్లు (పీపీఈ)లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి, విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచించింది. 60 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక వాటాను సొంతం చేసుకోవాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో పీపీఈ కిట్ల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇండియన్ అపారెల్ ఇండస్ట్రీ పీపీఈ కిట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. సున్నా నుంచి మొదలుపెట్టి, నాలుగు నెలల్లోనే రోజుకు 8 లక్షల పీపీఈ కిట్లను తయారు చేసే స్థాయికి ఎదిగింది.
అపారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) చైర్మన్ డాక్టర్ ఏ శక్తివేల్ మాట్లాడుతూ, రోజుకు 8 లక్షల పీపీఈ కిట్లను తయారు చేసే స్థాయికి ఇండియన్ అపారెల్ ఇండస్ట్రీ ఎదిగే విధంగా ప్రోత్సహించిన టెక్స్టైల్స్ మంత్రి స్మృతి ఇరానీకి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో కీలక పాత్ర పోషించేందుకు టెక్స్టైల్స్ శాఖ కార్యదర్శి రవి కపూర్ నాయకత్వంలో ఎంటర్ప్రెన్యూరియల్ ఇండస్ట్రీ సిద్ధంగా ఉందన్నారు. రాబోయే ఐదేళ్ళలో అంతర్జాతీయ మార్కెట్లో 60 బిలియన్ డాలర్లకు పైగా పీపీఈ కిట్ల వాటా ఉంటుందని, దీనిలో అత్యధిక వాటాను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
పీపీఈ కిట్ల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించాలని కోరుతూ వాణిజ్య, పరిశ్రమల శాఖ, టెక్స్టైల్స్ శాఖల మంత్రులకు లేఖలు రాసినట్లు తెలిపారు.
Updated Date - 2020-06-21T20:40:58+05:30 IST