వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు చేపట్టే అంశాలు ఇవే
ABN, First Publish Date - 2020-09-13T23:52:40+05:30
వర్షాకాల సమావేశాల్లో చేపట్టబోయే అంశాల గురించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
న్యూఢిల్లీ : వర్షాకాల సమావేశాల్లో చేపట్టబోయే అంశాల గురించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ సమావేశాల్లో చేపట్టేందుకు 47 అంశాలను గుర్తించినట్లు పేర్కొంది.
సోమవారం నుంచి అక్టోబరు 1 వరకు సమావేశాలు జరుగుతాయి. అయితే అవసరాన్నిబట్టి మార్పులు జరగవచ్చు. శని, ఆదివారాలు కూడా సమావేశాలు జరుగుతాయి. మొత్తం మీద 18 రోజులు, 18 సిటింగ్స్ జరుగుతాయి. ఈ సమావేశాల్లో చేపట్టేందుకు 47 ఐటమ్స్ను గుర్తించారు. వీటిలో 45 బిల్లులు, 2 ఆర్థిక అంశాలు ఉన్నాయి.
ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే 11 బిల్లుల్లో వ్యవసాయోత్పత్తుల వాణిజ్య ప్రోత్సాహక బిల్లు, రైతుల సాధికారత, ధరలు, వ్యవసాయ సేవల బిల్లు; హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ సవరణ బిల్లు, ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ సవరణ బిల్లు, నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు, ఇన్సాల్వెన్సీ బిల్లు, పార్లమెంటు సభ్యుల జీత భత్యాలు, పింఛన్ల బిల్లు ఉన్నాయి.
కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ సమావేశాలను నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజ్యసభ సమావేశాలు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు, లోక్సభ సమావేశాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతాయని తెలిపింది.
Updated Date - 2020-09-13T23:52:40+05:30 IST