పొంగిప్రవహిస్తున్న శబరి నది..సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
ABN, First Publish Date - 2020-08-18T14:01:14+05:30
భారీవర్షాల వల్ల శబరి నది పొంగి ప్రవహిస్తుండటంతో ముంపుప్రాంతాల్లో చిక్కుకుపోయిన 35 మందిని అగ్నిమాపకశాఖ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఘటన....
మల్కన్గిరి (ఒడిశా): భారీవర్షాల వల్ల శబరి నది పొంగి ప్రవహిస్తుండటంతో ముంపుప్రాంతాల్లో చిక్కుకుపోయిన 35 మందిని అగ్నిమాపకశాఖ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఘటన ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో వెలుగుచూసింది. మల్కన్ గిరి జిల్లాలో గడచిన ఐదు రోజుల్లో అత్యధికంగా 463.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వరదనీరు పలు ప్రాంతాలను ముంచెత్తడంతో అధికారులు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. ఒడిశా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో పది జిల్లాల్లో వరదలు వెల్లువెత్తుతున్నాయి. వరదల పరిస్థితిని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్ త్రిపాఠి, ప్రత్యేక సహాయ పునరావాస కమిషనర్ ప్రదీప్ జెనాలు 10 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి సహాయ పునరావాస పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. మరో రెండురోజుల పాటు ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ఒడిశా ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.
Updated Date - 2020-08-18T14:01:14+05:30 IST