కోలుకున్న కొవిడ్ రోగులతో ఆరోగ్య సేవలు!
ABN, First Publish Date - 2020-05-11T14:09:30+05:30
లాక్డౌన్ ప్రకటించిన ప్రపంచదేశాలు విడతలవారీగా పలు రంగాలకు సడలింపులు ఇస్తున్నాయి. వైరస్ ముప్పు పొంచి ఉందని తెలిసినా.. ఆర్థిక వ్యవస్థలను గాడినపెట్టేం
వాషింగ్టన్, మే 10 : లాక్డౌన్ ప్రకటించిన ప్రపంచదేశాలు విడతలవారీగా పలు రంగాలకు సడలింపులు ఇస్తున్నాయి. వైరస్ ముప్పు పొంచి ఉందని తెలిసినా.. ఆర్థిక వ్యవస్థలను గాడినపెట్టేందుకు ఇలా చేయక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కరోనాతో సహజీవనం చేస్తూ.. ఆర్థికాన్ని గతంలోలా పరుగులు తీయించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.
కొవిడ్-19 ఇన్ఫెక్షన్ బారినపడి కోలుకున్న వారిలో ఔత్సాహికులు, నిరుద్యోగులకు ప్రాథమిక శిక్షణ అందించి.. ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు (డయాగ్నస్టిక్స్ సెంటర్స్) వంటి చోట్ల వినియోగించుకోవచ్చని సూచించారు. కరోనా ముప్పు అధికంగా ఉన్న అన్ని రంగాల్లోనూ వారి సేవలను వినియోగించుకోవచ్చన్నారు. తద్వారా ఆరోగ్య సంరక్షణ సేవల్లో అలసిపోయిన సహాయక వైద్యసిబ్బందిపై పని ఒత్తిడి తగ్గుతుందన్నారు. కొత్తగా ఉద్యోగ అవకాశాల సృష్టి కూడా జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2002-03లో కలకలం రేపిన సార్స్ వైరస్ బారినపడిన వారికి రెండేళ్ల పాటు ఆ ఇన్ఫెక్షన్ దరిచేరలేదు. కొవిడ్-19 సోకినవారిలోనూ వ్యాధి నిరోధక వ్యవస్థ ఇదే విధమైన రక్షణ పొందుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈవిషయం నిర్ధారణకు మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉందని స్పష్టంచేశారు.
Updated Date - 2020-05-11T14:09:30+05:30 IST