కరెన్సీ నోట్లతో కరోనా టెన్షన్.. సీఏఐటీ హెచ్చరికతో కొత్త విషయం వెలుగులోకి..
ABN, First Publish Date - 2020-03-21T16:11:10+05:30
కరోనా వైరస్ కేవలం మనుషులను తాకటం ద్వారా, వారు సంచరించిన ప్రదేశాల్లోని వస్తువులను తాకటం ద్వారా విస్తరిస్తుందని, వాటికి దూరంగా ఉంటే సరిపోతుందని భావిస్తూ వస్తున్నాం.
గుంటూరు (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ కేవలం మనుషులను తాకటం ద్వారా, వారు సంచరించిన ప్రదేశాల్లోని వస్తువులను తాకటం ద్వారా విస్తరిస్తుందని, వాటికి దూరంగా ఉంటే సరిపోతుందని భావిస్తూ వస్తున్నాం. కానీ కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఆర్థిక శాఖను హెచ్చరిస్తూ చేసిన సూచన ఇప్పుడు అతి పెద్ద కలవరానికి దారి తీసింది. అదే నోట్ల లెక్కింపు... మనం ఎవరికైనా నగదు ఇవ్వాలన్నా, ఎవరైనా ఇచ్చినవి సరి చూసుకోవాలన్నా డబ్బు లెక్కింపు తప్పని సరి. ఇప్పుడిప్పుడే ఆన్లైన్ బ్యాంకింగ్ విస్తరిస్తున్నప్పటికీ అది కేవలం 3 శాతానికి పరిమితం. ఈ క్రమంలో 97 శాతం నగదు చేతుల మీదే లెక్కిస్తున్నారు. వీటిని లెక్కించే క్రమంలో ఒక వేళ కరోనా సోకిన వ్యక్తి ఒకసారి నోట్ల తడి చేసి నోట్లను లెక్కిస్తే.. ఆ వైరస్ నోట్లకూ పాకుతుంది.. అయితే ఆ వైరస్.. కరెన్సీ నోట్లపై ఎన్ని గంటలు ఉంటుంది అనేది ఇప్పటి వరకు అధ్యయనం జరగలేదు.
పరిష్కారం లేదా...
ఒక నోటు పొరపాటున కరోనా వైరస్ వ్యక్తి నుంచి ఉదయం బయటకు వస్తే అది సాయంత్రానికి ఎంత మందికైనా మారవచ్చు. వీరందరి చేతికి వైరస్ చేరినట్లే. పొరపాటున అదే జరిగితే జరిగే నష్టం ఊహకు కూడా అందడం లేదు. అందువలన కరెన్సీ సాధ్యమైనంత వరకు నోటితో తడి చేయకుండానే లెక్కించండి. వీలైనంత వరకు ఫోన్పే, గూగుల్పే వంటి వాటిని వాడండి. ఏటీఎంలలో కొత్త నోట్లు అంటుకు పోయి వస్తాయి... వాటిని విడదీసే సమయంలో నోట్ల ఉన్న తేమ సహాయం వద్దు. ఇప్పటి వరకు ఈ కోణంలో ప్రపంచంలో ఎక్కడా కరోనా ప్రమాదం ముంచి ఉందని ప్రచారం జరగటం లేదు. సీఏఐటీ చేసిన హెచ్చరికతో ఇది వెలుగులోకి వచ్చింది.
Updated Date - 2020-03-21T16:11:10+05:30 IST