కాగజ్నగర్ ఏఈపై మున్సిపల్ చైర్మన్ దాడి
ABN, First Publish Date - 2020-11-19T05:44:18+05:30
కాగజ్నగర్ ఏఈపై మున్సిపల్ చైర్మన్ దాడి
-సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు
కాగజ్నగర్, నవంబరు18: కాగజ్నగర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్పై అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ బుధవారం దాడి చేశాడు.మున్సిపల్ కార్యాలయంలో పెండింగ్ పనుల విషయమై మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆగ్ర హం చెందిన మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ కుర్చీతో ఏఈపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఏఈని మున్సిపల్ చైర్మన్ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. ఈ సంఘటనతో సిబ్బంది అంతా విస్తుపోయారు. తోటి సిబ్బంది తేరుకుని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్కు సమాచారం అందించారు. వెంటనే కమిషనర్ గొడవ జరుగుతున్న స్థలం వద్దకు చేరుకున్నారు. మున్సిపల్ చైర్మన్కు సర్ది చెప్పారు. తీవ్ర మనస్థాపానికి గురైన ఏఈ సతీష్ బయటకు వచ్చి సమస్యను ఉన్నతాఽధికారులకు వివరించారు. వెంటనే మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు రంగంలోకి దిగి సమీక్షించారు. ఘటనకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలోని సీసీ ఫుటేజీ చూడాలని ప్రయత్నించారు.
ప్రత్యేక టెక్నీషియన్తో సీసీ ఫుటేజీ కోసం ప్రయత్నించడగా గతేడాది నుంచి సీసీ కెమెరాలు పని చేయడం లేదని తేలింది. అయితే తనపై జరిగిన దాడిపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్కు ఏఈ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులకు కూడా ఏఈ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈవిషయమై మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ను వివరణ కోరగా ఏఈ సతీష్పై తాను దాడి చేయలేదని పేర్కొన్నారు. ఏఈ విధులు సక్రమంగా నిర్వహించటం లేదని, ఈ విషయంలో వాకబు చేసినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చైర్మన్ తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏఈ ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్నానని పేర్కొన్నారు. కాగా మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యచరణను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
Updated Date - 2020-11-19T05:44:18+05:30 IST