పింఛన్ నుంచి ఇంటి పన్ను కట్
ABN, First Publish Date - 2020-02-12T09:53:51+05:30
పింఛన్ డబ్బుల నుంచి ఇంటి పన్ను మినహాయించుకోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బలవంతంగా లాగేసుకోవడం ఏంటని ఆందోళనకు దిగారు. వికారాబాద్
బలవంతంగా కట్టించుకుంటున్న కార్యదర్శి
బషీరాబాద్, ఫిబ్రవరి 11: పింఛన్ డబ్బుల నుంచి ఇంటి పన్ను మినహాయించుకోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బలవంతంగా లాగేసుకోవడం ఏంటని ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం భోజ్యానాయక్ తండా పంచాయతీకి చెందిన గిరిజనులు ఈ విషయమై స్థానిక ఎంపీటీసీ లక్ష్మీబాయికి మొరపెట్టుకున్నారు. నెల పింఛన్ డబ్బులతో కాలం వెళ్లదీసే తమ దగ్గర పంచాయతీ కార్యదర్శి ఇంటి పన్నులు బలవంతంగా కట్టించుకుంటున్నారని గిరిజనులు ఆరోపించారు.
ఈ విషయమై బాధితులను ఎవరూ పట్టించుకోవడంలేదంటూ ఎంపీటీసీ లక్ష్మీబాయి, మాజీ సర్పంచ్ శివరాంనాయక్, మాజీ ఉప సర్పంచ్ ఏష్యానాయక్ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గ్రామ కార్యదర్శి సంధ్యారాణిని వివరణ కోరగా ఇంటి పన్ను వసూలు చేయడానికి ప్రతి రోజు ఇంటింటికీ తిరుగుతున్నానని, సోమవారం పింఛన్ డబ్బులు తీసుకునేందుకు వచ్చిన కొందరు స్వయంగా వచ్చి పన్ను చెల్లించారని చెప్పారు. తాను ఎవరినీ బలవంతం చేయలేదని ఆమె అన్నారు.
Updated Date - 2020-02-12T09:53:51+05:30 IST