ఉపాధికి ‘వారధి’
ABN, First Publish Date - 2020-03-15T12:28:18+05:30
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలతో పాటు ఉపాధి కల్పిస్తున్న వారధి ప్రగతి పలు
ఎంప్లాయిమెంట్ శాఖ నుంచి జాబ్ మేళాల నిర్వహణ
గద్వాల, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలతో పాటు ఉపాధి కల్పిస్తున్న వారధి ప్రగతి పలు జిల్లాలకు పాకింది. గతంలో కలెక్టర్గా పని చేసిన శశాంక కరీంనగర్ మునిసిపాలిటీలో కమిషనర్గా పని చేసిన సమయంలో వారిధిపై అధ్యయనం చేశారు. ఆ జిల్లాలో అప్పటి కలెక్టర్ నీతూ ప్రసాద్ నిరుద్యోగులకు ఏదైనా ఉపాధి చూపించాలనే లక్ష్యంతో కలెక్టరేట్లో వారధి ఏర్పాటు చేయించారు. ఈ వారిధి ద్వారా గ్రూపు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు మెటీరియల్, కోచింగ్ ఇవ్వడం ప్రారంభించారు. మరో పక్క వివిధ రంగాల్లో డిగ్రీలు పూర్తి చేసిన వారికి, దరఖాస్తులు చేసుకుంటే వివిధ కంపెనీలతో టై చేసుకొని వారికి ఉపాధి కల్పించారు.
ఈ ప్రక్రియ జోగుళాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగలుకు వరంగా మారింది. కరీంనగర్ కమిషనర్ నుంచి గద్వాల కలెక్టర్గా శశాంక రాగా, జిల్లాలో నిరుద్యోగలుకు ఉపాధి కల్పన అందించాలనే లక్ష్యంతో గద్వాల ఉపాధి కల్పనాధికారి ప్రియాంకను కరీంనగర్ వెళ్లి వారిధిపై అధ్యయనం చేయించారు. ఇదే సమయంలో ఆయన బదిలీ అయ్యారు. ఉపాధి కల్పన అధికారిగా పని చేస్తున్న ప్రియాంక ఇటీవల 12కు పైగా ఉద్యోగ మేళాలు నిర్వహించి, ఉపాధి అవకాశాలకు జీవం పోస్టున్నారు.
130 మందికి ఉద్యోగాలు
ఇటీవల కాలంలో జిల్లాలో వివిధ కంపెనీలు మైల్ స్టోన్, సిన్క్రోవర్స్, సొల్యూషన్స్, ఈడబ్ల్యూఆర్సీ ప్రభుత్వ శిక్షణ, ఎస్ఎల్వీ మాన్పవర్, ఎల్ఐసీ ఇండియా, విశ్వం కంప్యూటర్స్ ఇలా 15 కంపెనీల వరకు పిలిపించి జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో కొందరికి ఉద్యోగాలు ఇప్పించారు. వీటితోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో కొనసగుతున్న మరో సంస్థల జాబ్ మేళా నిర్వహించారు. సుమారు 130పైగా ఉద్యోగాలు ఇప్పించారు. అలాగే 60 మందికి మూడు నెలల పాటు శిక్షణ ఇప్పించి వారిని సెల్స్ రంగంలోకి దింపారు. వీటితోపాటు పలువురికి జమ్మిచేడులో ఉన్న కంప్యూటర్లో శిక్షణ ఇప్పించి, వివిధ రంగాల్లో కంప్యూటర్ ఆపరేట్లుగా చేర్పించారు. శనివారం నిర్వహించిన జాబ్ మేళాలో మరికొంత మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
కొద్దిపాటి చేయూత
మాములుగా పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వారికి, ఉపాధి కల్పన కార్యాలయం నిర్వహిస్తున్న జాబ్మేళాలు ఎంతో కొంత ఉపయోగపడ్డాయి. జిల్లాలోని 12 మండలాలు ఉండగా, ఎక్కువగా గట్టు, కేటీదొడ్డి, మల్దకల్ మండలాలు వెనుకబాటుగా ఉన్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన వారిని ఎక్కువగా గుర్తించి, వారికి శిక్షణతో పాటు ఉపాధి కల్పిస్తున్నారు. వివిధ కంపెనీల్లో ఎంపికైన వారికి రూ.8,500 నుంచి రూ. 10 వేల జీతాలు ఇస్తున్నారని అధికారులు తెలిపారు. డ్రైవర్లకు మాత్రం రూ.15 వేలకుపైగా జీతాలు వస్తున్నాయని చెప్పారు.
Updated Date - 2020-03-15T12:28:18+05:30 IST