అప్పాయపల్లిలో పర్యటన అభివృద్ధి పనులపై సమీక్షించిన కలెక్టర్
ABN, First Publish Date - 2020-03-12T05:56:20+05:30
సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీధర్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని అప్పాయపల్లిలో పర్యటించిన
లింగాల, మార్చి 11 : సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీధర్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని అప్పాయపల్లిలో పర్యటించిన కలెక్టర్ సంక్షేమ పథకాల అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పైపు లైన్లు, ట్యాంక్ నిర్మాణం పనులు, నర్సరీల నిర్వహణను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామంలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. మిషన్ భగీరథ పనులలో జాప్యం జరుగడంపై అసహనం వ్యక్తం చేశారు.
గ్రామంలో ఉన్న 605ఇండ్లకు వారం రోజుల్లో మిషన్ భగీరథ నీటిని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. పల్లె ప్రగతి అమలును తెలుసుకున్నారు. రాబోవు ఐదేళ్లకు సంబంధించి ప్రణాళికను తయారు చేయాలని, పల్లె ప్రగతికి వచ్చిన నిధులు ఎన్ని, ఎంత ఖర్చు చేశారనే దానిపై రికార్డుల్లో ఉంచాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీదేనని కలెక్టర్ అన్నారు.
భూములన్న రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు రాలేదని, ఎలాంటి భూమి లేని వారికి బుక్కులు వచ్చాయని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లారు. భూములను సర్వే చేయించాలని ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు. ఈనెల 16నుంచి సర్వే చేపడుతామని, అర్హులైన రైతులకు అన్యాయం జరుగకుండా చూస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామంలో అక్షరాస్యత శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. చదువుకున్న వారు చదువు రాని వారికి చదువు చెప్పాలని కలెక్టర్ కోరారు. అభివృద్ధి పనుల్లో అప్పాయపల్లి ఆదర్శంగా నిలువాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్రావు, ఆర్డీవో పాండునాయక్, తహసీల్దార్ మల్లికార్జున్రావు, డీఈ హేమలత, ఏఈ బాల్రాంనాయక్, సర్పంచు నీలవేణి, ఎంపీటీసీ కాశీనాథం, ఆర్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-12T05:56:20+05:30 IST