నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ముగిసిన ఏసీపీ నర్సింహారెడ్డి విచారణ
ABN, First Publish Date - 2020-09-24T23:15:24+05:30
నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి విచారణ ముగిసింది. విచారణ అనంతరం నర్సింహారెడ్డిని ఏసీబీ న్యాయమూర్తి
హైదరాబాద్: నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి విచారణ ముగిసింది. విచారణ అనంతరం నర్సింహారెడ్డిని ఏసీబీ న్యాయమూర్తి ఎదుట అధికారులు హాజరుపర్చనున్నారు. మరో వైపు నర్సింహారెడ్డి ఇళ్లు, బంధువుల ఇళ్లల్లో దొరికిన డాక్యుమెంట్లను బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులు పరిశీలిస్తున్నారు. నర్సింహారెడ్డికి సంబంధించిన భారీ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు విచారణను ఎదుర్కొంటున్న మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి.. సుమారు రూ.70 కోట్ల ఆస్తు లు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అంచనాకు వచ్చారు.
బుధవారం అతని నివాసంతోపాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి దీనిని గుర్తించారు. ఏసీబీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి మహేంద్రహిల్స్లోని నర్సింహారెడ్డి నివాసంతోపాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాలు, వరంగల్, జనగాం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో, ఏపీలోని అనంతపురంలో సోదాలు నిర్వహించారు. మొత్తంగా తెలంగాణ, ఏపీలోని 25 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. మహేంద్రహిల్స్ త్రిమూర్తి కాలనీలోని నర్సింహారెడ్డి నివాసంలో ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం తనిఖీలు జరిపింది.
Updated Date - 2020-09-24T23:15:24+05:30 IST