వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం
ABN, First Publish Date - 2020-12-12T04:47:39+05:30
వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం
- విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
- 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన
మహేశ్వరం : రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరంలో రూ.4కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో 30 పడకల అసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబితారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు రోగులకు మెరుగైన సేవలందించాలని తెలిపారు. ఆసుపత్రి భవన సముదాయాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. మండల కేంద్రంలో నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీపీ కె,రఘుమారెడ్డి, వైస్ఎంపీపీ ఆర్.సునితా, సర్పంచ్ కర్రోళ్ల ప్రియాంకారాజేష్, డీసీహెచ్వో ఝాన్సీరాణి, డీఎల్పీవో తరుణ్, ఎంపీడీవో నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు అంబులెన్స్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తాం
కందుకూరు : పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అంబులెన్స్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు. శుక్రవారం అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపద సమయంలో అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల ప్రగతి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T04:47:39+05:30 IST