సిబ్బంది ఆరోగ్యంపై సత్వరమే స్పందించండి
ABN, First Publish Date - 2020-06-04T09:23:05+05:30
పోలీసు సిబ్బంది ఆరోగ్యం విషయంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా చూడాలని కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ
ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా చూడండి: డీజీపీ
హైదరాబాద్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): పోలీసు సిబ్బంది ఆరోగ్యం విషయంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా చూడాలని కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ కానిస్టేబుల్ విషయమై సోషల్ మీడియాలో మంగళవారం విస్తృత ప్రచారం జరిగింది. ఈతరహా పోస్టుల వల్ల సిబ్బంది మనోస్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉందని డీజీపీ పేర్కొన్నారు. సిబ్బంది ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు.
తల్లిదండ్రుల్ని వదిలేయొద్దు
తల్లిదండ్రులు ఎంతో కష్టపడి.. వారి కంటే మెరుగైన జీవితాన్ని పిల్లలకు అందిస్తారని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. వయస్సుపైబడి నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని వదిలేయొద్దని హితవు పలికారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు షేక్ హుస్సేన్-యాకుబీ ఆర్టీసీ బస్ షెల్టర్లో తల దాచుకోగా.. ఖానాపూర్ ఎస్సై సాయిబాబు వారి పిల్లలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రస్తావించిన డీజీపీ.. పోలీసుల పని తీరును అభినందించారు.
Updated Date - 2020-06-04T09:23:05+05:30 IST