చెట్ల పెంపకం ప్రాధాన్యతను మొదట గుర్తించింది కేసీఆరే-జగదీశ్రెడ్డి
ABN, First Publish Date - 2020-06-25T22:59:44+05:30
చెట్ల పెంపకం ప్రాధాన్యతను మొదట గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
సూర్యాపేట: చెట్ల పెంపకం ప్రాధాన్యతను మొదట గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అందులో భాగంగానే హరితహారం పేరుతో గడిచిన ఆరు సంవత్సరాలుగా చైతన్యం తీసుకు వచ్చి మొక్కల పెంపకంలో పోటీపడేలా చేసిన ఘనత కూడా ముమ్మాటికీ కేసీఆర్దేనని చెప్పారు. ఆరవ విడత హరితహారంలో భాగంగా గురువారం ఉదయం ఆయన సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని 9వ వార్డులో ఏకకాలంలో 1050 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమస్య ప్రపంచానికి సవాల్ విసురుతున్న నేపధ్యంలో అడవుల పెంపకం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టి సత్ఫలితాలు సాధించిందని చెప్పారు.
మొదటి విడత హరితహారంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మొక్క నాటి ప్రారంభించిన హరితహారంతోటే ఆ జాతీయ రహదారిపై హరితశోభ వర్ధిల్లుతోందన్నారు. పర్యావరణ సమస్యలను అధిగమించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని అన్నారు. అందుకు అనుగుణంగా టార్గెట్లు పెట్టుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉధ్యమంలా కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. మావన జాతి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో పర్యావరణం అతి ముఖ్యమైందన్నారు. వాతావరణంలో మార్పులు జరిగి వాయు కాలుష్యంతో ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలడం కూడా అందులో భాగమేనని మంత్రి తెలిపారు.
వాటన్నింటికి కారణం వర్షాలు పడక పోవడమేనని అంతే కాకుండా అడవులు అంతరించి పోవడం కూడా కారణమని అన్నారు. అటువంటి అడవుల పెంపకం పై దృష్టిసారించి మొక్కల పెంపకం ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్నట్టు తెలిపపారు. దానికి కొనసాగింపుగానే జిలల్లాలో 83 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్గా పెట్టుకుని హరితహారం ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ఛైర్మన్ గుజ్జ దీపికాయుగంధర్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, సూర్యాపేట మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, కలెక్టర్ అవినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-06-25T22:59:44+05:30 IST