పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి
ABN, First Publish Date - 2020-11-19T09:25:17+05:30
ఉపాధి హామీ పనులకు కూలీలు తక్కువగా రావడం, ఆస్తుల సర్వేపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మహబూబాబాద్ జిల్లాలో తొలగించిన పదిమంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు.
మానుకోట కలెక్టరేట్ ఎదుట ఆందోళన..
అరెస్టు చేసిన పోలీసులు
మహబూబాబాద్ టౌన్, నవంబరు 18: ఉపాధి హామీ పనులకు కూలీలు తక్కువగా రావడం, ఆస్తుల సర్వేపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మహబూబాబాద్ జిల్లాలో తొలగించిన పదిమంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన శ్రీనివాస్, అర్బన్ అధ్యక్షుడు పమ్మి రాజు, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రంజిత్ మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఉపాధిహామీ పనులకు కూలీలు తక్కువగా వచ్చారని తొర్రూరు మండలంలో ఇద్దరు, పెద్దవంగరలో ముగ్గురు, దంతాలపల్లిలో ముగ్గురు, కేసముద్రంలో ఒకరిని మంగళవారం టర్మినేషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, గతంలో మరిపెడ మండలానిక చెందిన ఒకరిని కూడా టర్మినేషన్ చేశారని అన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి లతకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ వచ్చి హామీ ఇవ్వాలంటూ అక్కడే కూర్చున్నారు. కొద్ది సమయం తర్వాత కలెక్టర్ రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం కన్పించడంతో పోలీసులు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఆందోళనలో పంచాయతీ కార్యదర్శులు కరుణాకర్, అనిత, శ్రావణి, లక్ష్మికాంత్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-19T09:25:17+05:30 IST