రైతు భరోసాకు 3,030 కోట్లు
ABN, First Publish Date - 2021-05-13T08:24:42+05:30
రైతులకు పెట్టుబడి సాయంగా రూ.3030 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వైఎస్సార్ రైతు భరోసా.. పీఎం కిసాన్ పథకం కింద ఈ ఏడాది తొలివిడతలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది
తొలి విడతలో పెట్టుబడి సాయం
పంటల బీమాకు 2,589 కోట్లు
నిధులు విడుదల.. ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): రైతులకు పెట్టుబడి సాయంగా రూ.3030 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వైఎస్సార్ రైతు భరోసా.. పీఎం కిసాన్ పథకం కింద ఈ ఏడాది తొలివిడతలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. బుధవారం వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ అనుసంధాన రైతుల ఖాతాలకు ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా పెట్టుబడి సాయాన్ని జమచేయనున్నట్లు తెలిపారు. 2020 ఖరీఫ్ సీజన్లో పంటల బీమా పథకం కింద అర్హులైన రైతులకు రూ.2,589.60 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ అనుసంధాన రైతుల ఖాతాలకు నేరుగా బీమా సొమ్మును ఈ నెల 25వ తేదీన జమ చేస్తారు. 2021 సంవత్సరంలో అపరాలు, ముతక ధాన్యాల సేకరణకు మార్క్ఫెడ్కు రూ.300 కోట్ల రుణానికి గ్యారెంటీ ఇస్తూ ప్రభుత్వం అనుమతించింది.
నేడు రైతు భరోసా పంపిణీ
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం సాయం పంపిణీని సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. 2021-22 ఏడాదికి సంబంధించి తొలి విడత ఆర్థిక సాయాన్ని అన్లైన్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు. 52.38 లక్షల మంది రైతులకు దీని ద్వారా లబ్ధి కలగనుందన్నారు. ఎన్నికల ముందు రూ.12 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, రైతుల కష్టాలను గుర్తించి రూ. 13,500లు అందజేస్తున్నారన్నాని మంత్రి తెలిపారు. ఏపీలో సాగు చేసే యానాం రైతులకు, కౌలు రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ అందించాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. ఈ పథకానికి ఇంకా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు పొడిగింపు
ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపకుల సర్వీసును వచ్చే సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. న్యాయ, వైద్య, ఆరోగ్య తదితర 12 శాఖల పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ పొడిగింపు ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది. కాగా జీవో నెం.12, 24 ప్రకారం 10 రోజుల వ్యత్యాసంతో కాంట్రాక్టు ఉపాధ్యాయ, అధ్యాపకులకు 12 నెలల కొనసాగింపునకు ఆదేశాలివ్వాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
Updated Date - 2021-05-13T08:24:42+05:30 IST