లారీని ఢీకొన్న అంబులెన్సు: బాలిక మృతి
ABN, First Publish Date - 2021-03-22T05:41:59+05:30
అంబులెన్సు లారీని ఢీకొన్న ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన బాలిక మృతిచెందిన సంఘటన శ్రీకాళహస్తి మండలంలో ఆదివారం జరిగింది.
శ్రీకాళహస్తి అర్బన్, మార్చి 21: అంబులెన్సు ఓ లారీని ఢీకొన్న ఘటనలో ఓ బాలిక మృతిచెందిన సంఘటన శ్రీకాళహస్తి మండలంలో ఆదివారం జరిగింది. రూరల్ ఎస్ఐ ఈశ్వర్ కథనం మేరకు... నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నల్లయ్యగారిపాళెంకు చెందిన రమణయ్య కుమార్తె పద్మ(16) కొంతకాలంగా తలనొప్పితో బాధపడుతోంది. దీంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున అన్న శ్రీనివాసులు పద్మను అంబులెన్స్లో తిరుపతి రుయాస్పత్రికి తరలించేయత్నం చేశారు. శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లె వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని అంబులెన్సు ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ చికిత్స నిమిత్తం నెల్లూరు వెళ్లిపోయారు. ఈ ఘటనలో స్ట్రెక్చర్ నుంచి కిందపడిన బాలికను మరో అంబులెన్సులో రుయాకు తరలించగా అప్పటికే పద్మ మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - 2021-03-22T05:41:59+05:30 IST