పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ ఖరారు ఎప్పుడో..!
ABN, First Publish Date - 2021-12-19T05:48:57+05:30
పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న గ్రేడ్-5 సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ ఖరారు కోసం ఎదురు చూస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 18: పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న గ్రేడ్-5 సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ ఖరారు కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 577 మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన డిపార్ట్మెంటల్ పరీక్షల్లో 449 మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా వీరిని రెగ్యులరైజ్ చేయలేదు. 2019 అక్టోబరు 2న విధుల్లో చేరిన సచివాలయ ఉద్యోగులను రెండేళ్లు దాటాక రెగ్యులరైజ్ చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది అక్టోబరు 12న రెగ్యులర్ చేయాలి. ఈ క్రమంలోనే గత ఆగస్టులో డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ ఖరారు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా రెగ్యులర్ చేయకపోవడంతో సచివాలయ ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. ఈ విషయమై డీపీవో దశరథరామిరెడ్డిని ప్రశ్నించగా సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసే ప్రక్రియను చేపట్టామన్నారు. డిపార్ట్మెంటల్ పరీక్షల్లో అర్హత సాధించిన వారి సర్వీస్ రిజిస్టర్లను ఎంపీడీవోలు పరిశీలించి పంపిస్తున్నారన్నారు. త్వరలో వారి ప్రొబేషన్ను డిక్లేర్ అవకాశం ఉందని చెప్పారు.
Updated Date - 2021-12-19T05:48:57+05:30 IST