వరుస చోరీల నిందితుడి అరెస్టు
ABN, First Publish Date - 2021-10-31T05:36:51+05:30
గత రెండేళ్లుగా సత్తెనపల్లి పట్టణాన్ని వరుస చోరీలతో హడలెత్తించిన గజదొంగ పల్లపు రవిని పోలీసులు అరెస్టు చేశారు.
240 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం
గుంటూరు, అక్టోబరు 30: గత రెండేళ్లుగా సత్తెనపల్లి పట్టణాన్ని వరుస చోరీలతో హడలెత్తించిన గజదొంగ పల్లపు రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నిందితుడి నుంచి రూ.10 లక్షల ఖరీదైన 240 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 కేసులు చేధించినట్టు రూరల్ సీసీఎస్ అదనపు ఎస్పీ ఎనవీఎస్ మూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం గుంటూరులోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. రవి టైలరింగ్ చేస్తూ జీవనం సాగించేవాడని, అయితే మద్యం, పేకాట వంటి చెడు అలవాట్లకు బానిసై అందుకు అవసరమైన డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతున్నాడని అదనపు ఎస్పీ మూర్తి తెలిపారు. శుక్రవారం రాత్రి సత్తెనపల్లిలోని తాలూకా సెంటరులో అనుమానాస్పదంగా తిరుగుతున్న రవిని విచారించగా ఆయా చోరీల వ్యవహారం వెలుగుచూసిందన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీ మూర్తి అభినందించి రివార్డులు అందించారు.
Updated Date - 2021-10-31T05:36:51+05:30 IST