ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
ABN, First Publish Date - 2021-02-08T06:34:01+05:30
అటవీ హక్కు పట్టా మంజూరు కోసం ఒక గిరిజన రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని ఫారెస్టు గార్డు, అమె భర్తను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఫారెస్టు గార్డు
ఎ.కొండూరు, ఫిబ్రవరి 7 : అటవీ హక్కు పట్టా మంజూరు కోసం ఒక గిరిజన రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని ఫారెస్టు గార్డు, అమె భర్తను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విజయవాడ ఏసీబీ డీఎస్పీ పి.శరత్బాబు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన జరబల ఏసు అనే వ్యక్తికి తన భార్య కమలా పేరున ఎ.కొండూరు మండలం చీమలపాడు ఆర్ఎస్నెంబర్ 748లో రెండు ఎకరాలు, తన బావ దారావతు రంగారావు భార్య సుక్కి పేరున రెండు ఎకరాలు అటవీ భూమి ఉంది. దీర్గకాలంగా ఆ భూములను వారు సాగుచేసు కుంటున్నారు. ప్రభుత్వం ఇటీవల గిరిజనులకు అటవీ హక్కుపట్టాలు మం జూరు చేస్తుందని ప్రకటించడంతో సాగుదారులు దరఖాస్తు చేసుకున్నారు. స్థానికంగా ఫారెస్టు గార్డు విధులు నిర్వహిస్తున్న బాలసాని శేష కుమారి ఏసును పట్టా కోసం రీడింగ్ తియాలంటే రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. పైగా భూమిని సాగు చేయనీయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దీనితో విసిగిపోయిన ఏసు రూ.లక్ష ఇవ్వలేమని, రూ50 వేలకు బేరం కుదుర్చుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫారెస్టు గార్డు శేషకుమారి ఆదివారం ఎ.కొండూరులో తన నివాసంలో ఏసు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుం టుండగా డీఎస్పీ శరత్బాబు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు శేషకుమారి, భర్త జగనాథ సుధాకర్ను రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదుచేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఏఎస్సీ కె.ఎం.మహేశ్వరరాజు, డీఎస్సీ. బి. శ్రీనివాసరావు, సీఐ హ్యాపీ కృపానందం, ఎస్సైలు నాంచారయ్య, నజీముల్లా పాల్గొన్నారు.
Updated Date - 2021-02-08T06:34:01+05:30 IST