హమ్మయ్య..!
ABN, First Publish Date - 2021-05-03T04:44:10+05:30
కరోనా విజృంభిస్తున్న నేసథ్యంలో ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. పరిస్థితులు చక్కబడ్డాక తేదీలు ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇంటర్ పరీక్షలు వాయిదా
ఊపిరిపీల్చుకున్న అధికారులు, విద్యార్థులు
నెల్లూరు(స్టోన్హౌస్పేట), మే 2: కరోనా విజృంభిస్తున్న నేసథ్యంలో ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. పరిస్థితులు చక్కబడ్డాక తేదీలు ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలంటూ రాజకీయ పార్టీలు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తామని ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నెల 5వ తేదీ నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా అధికారులు ఇప్పటికే పరీక్షల నిర్వాహణకు సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు. వారిలో కొందరికి కరోనా సోకడంతో వారం రోజులుగా సర్దుబాటులు చేసుకుంటూ రేయింబవళ్లు కార్యాలయాల వద్దే విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 35 స్టోరేజ్ పాయింట్ల (పోలీసు స్టేషన్ల)కు ప్రశ్నాపత్రాలు చేరుకున్నాయి. ఈ పరీక్షలకు ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 28,328, ఒకేషనల్ 2,400 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 27,298 మంది, ఒకేషనల్ 2,519 మంది హాజరు కావాల్సి ఉంది. అయితే కొవిడ్ రెండో దశ విజృభిస్తుండటం, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పరీక్ష రాసేందుకు విద్యార్థులను పంపాలా వద్దా అని తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఇక పరీక్షల విధులకు హాజరయ్యే సిబ్బంది కూడా ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సూచనల మేరకు పరీక్షలను వాయిదా వేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, పరీక్షల నిర్వాహణ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Updated Date - 2021-05-03T04:44:10+05:30 IST