తెలుగు అమలు కోసం హైకోర్టులో పిల్
ABN, First Publish Date - 2021-12-25T08:25:28+05:30
రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వం ఇచ్చే జీవోలు తెలుగులో ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వం ఇచ్చే జీవోలు తెలుగులో ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, యువజనాభివృద్ధి, సాంస్కృతిక మరియు పర్యాటకశాఖ శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఏపీ అధికార భాషా చట్టం-1966 మేరకు పభుత్వ పాలనాభాషగా తెలుగు అమలు కోసం ప్రభుత్వం జారీచేసిన పలు జీవోలను అమలు చేయకపోవడాన్ని సవాల్చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరికి చెందిన గుంటుపల్లి శ్రీనివాస్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అధికార భాషా చట్టాన్ని ప్రభుత్వం సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు.
Updated Date - 2021-12-25T08:25:28+05:30 IST