మేయర్, చైర్మన్ పదవులపై ఉత్కంఠ
ABN, First Publish Date - 2021-03-14T05:30:00+05:30
ఒంగోలు కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో మేయర్, డిప్యూటీ మేయర్.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా అన్నిచోట్లా అధికార వైసీపీకి ఆధిక్యం లభించిన నేపథ్యంలో పలుచోట్ల ఈ విషయంలో ఆపార్టీలో అంతర్గత పోరు నడిచే అవకాశం కనిపిస్తోంది. ఒంగోలులో మేయర్ పదవిని పలువురు ఆశిస్తున్నప్పటికీ మంత్రి బాలినేని ఆశీస్సులతో గంగాడ సుజాతకు అవకాశం ఖాయంగా కనిపిస్తోంది.
ఒంగోలులో డిప్యూటీ మేయర్ కోసం పోటీ
అద్దంకిలో మహిళా కూలీకి అనూహ్యంగా
లభించిన అవకాశం
చీరాలలో అంతర్గత పోరుకు అవకాశం
మేయర్, చైర్మన్ పదవులపై ఉత్కంఠ
ఒంగోలులో డిప్యూటీ మేయర్ కోసం పోటీ
అద్దంకిలో మహిళా కూలీకి అనూహ్యంగా
లభించిన అవకాశం
చీరాలలో అంతర్గత పోరుకు అవకాశం
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
ఒంగోలు కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో మేయర్, డిప్యూటీ మేయర్.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా అన్నిచోట్లా అధికార వైసీపీకి ఆధిక్యం లభించిన నేపథ్యంలో పలుచోట్ల ఈ విషయంలో ఆపార్టీలో అంతర్గత పోరు నడిచే అవకాశం కనిపిస్తోంది. ఒంగోలులో మేయర్ పదవిని పలువురు ఆశిస్తున్నప్పటికీ మంత్రి బాలినేని ఆశీస్సులతో గంగాడ సుజాతకు అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. అయితే డిప్యూటీ మేయర్ పదవి విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఆ పదవిని ఆశిస్తూ పోటీలో ఉన్న ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వేమూరి శ్రీనివాసులు డివిజన్లో ఓటమి చెందారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి ముగ్గురు పోటీ చేయగా ఇద్దరే గెలిచారు. ఈ పదవిని ఆశిస్తున్న ఇతర అగ్రవర్ణాల్లో కమ్మ సామాజికవర్గం నుంచి ఆరుగురు పోటీ చేయగా నలుగురు విజయం సాధించారు. కాపు సామాజిక వర్గం నుంచి ఆరుగురు పోటీచేయగా నలుగురు గెలిచారు. రెడ్డి సామాజిక వర్గం నంచి ఆరుగురు పోటీ చేయగా ఐదుగురు విజయం సాధించారు. బీసీల్లో బలమైన సామాజిక వర్గం నుంచి ఎవినిమిది మంది పోటీ చేయగా ఏడుగురు, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి పోటీ చేసిన ఇద్దరు గెలిచారు. మేయర్ పదవి దళిత మహిళకు రిజర్వు అయినందున డిప్యూటీ మేయర్ విషయంలో అగ్రవర్ణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆవర్గాల వారు పట్టుబడుతున్నారు. ప్రధానంగా కమ్మ, కాపు సామాజిక వర్గాల వారు మాకంటే మాకంటూ పట్టుబడుతున్నారు. మధ్యలో ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం వారు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది.
చీరాలలో అధికార పార్టీలోనే పోటీకి ఆస్కారం
చీరాల మునిసిపాలిటీలో కరణం బలరాంకు సానుకూలంగా ఉండే వైసీపీ అభ్యర్థులు అవసరమైన స్థాయిలో విజయం సాధించారు. 33 వార్డులలకు గాను 19చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఎమ్మెల్యేగా బలరాం ఓటు ఆ పార్టీకి అనుకూలంగా ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ మద్దతుదారులు 11 మంది గెలవడంతో ఆయన కూడా పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కీలకమయ్యే అవకాశం కనిపిస్తోంది.
అద్దంకిలో అనూహ్య పరిణామం
అద్దంకి నగర పంచాయతీలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్కడ వైసీపీకి పూర్తి ఆధిక్యం లభించింది. కానీ వైసీపీ ప్రతిపాదించిన చైర్మన్ అభ్యర్థి ఓటమి చవి చూశారు. దీంతో వైసీపీ తరఫున గెలుపొందిన మరో దళిత మహిళ ఇస్తేరమ్మను చైర్పర్సన్ అభ్యర్థిగా ఆపార్టీ నేత కృష్ణచైతన్య ప్రతిపాదించారు. ఆమేరకు ఆదివారం రాత్రి ఆమెను మంత్రి బాలినేనికి కూడా చైతన్య పరిచయం చేశారు. దీంతో మహిళా కూలీగా ఉండి విజయం సాధించిన ఇస్తేరమ్మకు అనూహ్యంగా చైర్పర్సన్ అవకాశం దక్కనుంది. ఇక్కడ ఆర్యవైశ్య సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండే డివిజన్లో మూడు చోట్ల వైసీపీకి అపజయం ఎదురైనా ఆ పార్టీ బలపరిచిన వైస్ చైర్మన్ అభ్యర్థి, ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన పద్మేష్ గెలుపొందడం ద్వారా ఆయనకు రూట్ క్లియర్ అయింది.
మార్కాపురంలో రెండు సామాజికవర్గాల నుంచి పోటీ
మార్కాపురం మునిసిపాలిటీలో ఆర్యవైశ్య, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారి నుంచి పోటీ తీవ్రమైంది. స్థానిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆర్యవైశ్య సామాజికవర్గం అభ్యర్థికి తొలి మూడేళ్లు అవకాశం ఇచ్చి, చివరి రెండేళ్లు రెడ్డి సామాజిక వర్గం వారిన చైర్మన్ చేయాలని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. అయితే విషయం పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లినందున ఎలాంటి మార్పు చేసుకుంటుందనేది వేచి చూడాల్సి ఉంది.
గిద్దలూరులో తేలని చైర్మన్ అభ్యర్థి
గిద్దలూరు నగర పంచాయతీలో ఎమ్మెల్యే రాంబాబు ప్రతిపాదించిన అభ్యర్థి బీసీగా సర్టిఫికేట్ పొందినా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారన్న విషయం ముందుగానే వివాదాస్పదమైంది. పోలింగ్కు ముందే బీసీలందరూ ఐక్యంగా ఈ అంశాన్ని ఎత్తిచూపడంతో వైసీపీ అధిష్ఠానం జోక్యం చేసుకోవడం, తాము ఇంకా చైర్మపర్సన్ అభ్యర్థిని ఎంపిక చేయలేదని ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో యాదవ సామాజిక వర్గం వారి నుంచి పోటీ పెరిగింది. ఫలితంగా వైసీపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశమైంది.
కనిగిరి, చీమకుర్తిల్లో..
కనిగిరిలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని చైర్పర్సన్ చేయాలని ఎమ్మెల్యే మధుసూదన యాదవ్ భావిస్తున్నారు. అయతే గతంలోనూ బీసీల కోటాలో ముస్లింలకు అవకాశం లభించినందున ఈ పర్యాయం తమకు అవకాశం ఇవ్వాలని బీసీల్లోని ఇతర సామాజికవర్గాల వారు డిమాండ్ చేస్తున్నారు. చీమకుర్తిలో బీసీ వర్గాలకు చెందిన రెండు వర్గాల మధ్య పోటీ పెరిగింది. పద్మశాలీ ఓటర్లు అధికంగా ఉండగా, స్థానిక వైసీపీ నేతలు బీసీల్లో వేరే సామాజిక వర్గం వారిని చైర్మన్ను చేయాలని భావిస్తున్నారు. దీంతో చైర్పర్సన్ అభ్యర్థి ఎంపిక ఇక్కడ కూడా సాఫీగా జరుగుతుందా లేక అధిష్టానం జోక్యం చేసుకుంటుందా అనే అనుమానాలు రెకెత్తాయి.
Updated Date - 2021-03-14T05:30:00+05:30 IST