సమన్వయంతో సమస్యల పరిష్కారం
ABN, First Publish Date - 2021-10-31T07:22:55+05:30
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను మండలస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేయాలని కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు.
మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మహీధర్రెడ్డి
సమస్యలపై సభ్యుల గళం
వలేటివారిపాలెం అక్టోబరు 30 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను మండలస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేయాలని కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. వలేటివారిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రఫీక్అహ్మద్ ఆధ్వర్యంలో ఎంపీపీ పొనుగోటి మౌనిక అద్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే మహీధర్రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీలలో వీధిదీపాల నిర్వాహణ సర్పంచ్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కొండారెడ్డిపాలెం, కళ్లవళ్ల గ్రామాలలో జలజీవన్మిషన్ పథకం కింద వాటర్ట్యాంకులు మంజూరయ్యాయన్నారు. వాటర్ట్యాంకులు నిర్మాణానికి ఒకట్రెండు రోజులలో స్థల సేకరణచేస్తామన్నారు. వలేటివారిపాలెం బస్టాండు కూడలిలో రహదారిపై వర్షం నీళ్లు నిలబడండంతో కార్యదర్శి పనితీరుపై అసహనం వ్యక్తం చేశాడు. పోకూరు పంచాయతీకి జలజీవన్మిషన్ పథకం కింద మంజూరైన నిధులపై డీఈ, ఏఈలు పొంతన లేని సమాదానాలు చెప్పడంతో ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశాడు
సమస్యలను లేవనెత్తిన సభ్యులు
సమావేశంలో అధికారులపై సభ్యులు గళమెత్తారు. గతేడాది జరిగిన నష్టపరిహారం రైతులకు ఇప్పటి వరకూ అందలేదని పోలినేనిపాలెం ఎంపీటీసీ సభ్యులు చింతలపూడి రవీంద్ర అధికారిని ప్రశ్నించారు. అలాగే రైతులకు అవసరమైన డీఏపీని సరఫరా చేయాలని కోరారు. ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఓ రోటావేటర్ అవసరం అని రైతులు కోరుతున్నట్లు తెలిపారు. కొవిడ్ మృతులకు ప్రభుత్వం అందజేసే రూ.50 వేలు పరిహరంపై బాదితులకు స్పష్టత ఇవ్వాలని అదికారులను కోరారు. పోకూరులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వీదిలైట్లు వెలగడం లేదని ఎంపీటీసీ నూకతోటి విజయలక్ష్మీ చెప్పారు. అయ్యవారిపల్లెలో మూడో విద్యుత్వైరు లేక వీదిలైట్లు రాత్రింపగళ్లు వెలుగుతున్నట్లు సర్పంచ్ డేగా వెంకటేశ్వర్లు తెలిపారు. కల్లవళ్ల ఆది ఆంద్ర కాలనీలో సైడు కాలువలు లేక వర్షంనీళ్లు వీధుల్లోనే నిబడుతున్నాయని వైస్ ఎంపీపీ స్వర్ణ నరసింహం చెప్పారు. చుండి మోడల్స్కూల్ వద్ద ఆర్టీసీబస్సు ఆపడం లేదని, దీంతో విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ ఇరపని సతీష్ సమావేశంలో ఆర్టీసీ అదికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఇంటూరి భారతి, తహసీల్దార్ రెహ్మన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సమన్వయంతో గ్రామాల అభివృద్ధి
ఉలవపాడు : స్థానిక సర్పంచ్, కార్యదర్శులు స్థానిక సమస్యల ప్రణాళికతో ముందుకెళితే గ్రామాల అభివృద్ధి సాధ్యమని కందుకూరు శాసన సభ్యుడు మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ వాయల మస్తానమ్మ అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీల్లో 14, 15వ ఆర్థిక సంఘం నిధులు త్వరితగతిన అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలన్నారు. పంచాయతీ జనరల్ బాడీలో గ్రామంలో అభివృద్ధి పనులను గుర్తించి అనుగుణంగా ఉన్న బడ్జట్తో పనులు చేపట్టాలని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, వీధి దీపాల నిర్వహణలపై బద్ధిపూడి సర్పంచ్ అనిల్రెడ్డి, మన్నేటికోట సర్పంచ్ బసవయ్యనాయుడు, రామాయపట్నం సర్పంచ్ గోవిందు తదితరులు ఆయా శాఖల అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరుణమ్మ, ఎంపీడీవో చెంచమ్మ, తహసీల్దార్ సంజీవరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ కే.రామ్మోహనరావు, విద్యుత్శాఖ ఏఈ నరసింహరావు, సీహెచ్సీ వైద్యులు సతీ్షబాబు, శ్రీనివాసులు, ఏపీఎం చిన్నయ్య, ఎంఈవో చెంచుపున్నయ్య, ఏసీవో వెంకటేశ్వర్లు, ఏవో మాల్యాద్రి, హార్టకల్చర్ అధికారి బ్రహ్మసాయి, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నోరుమెదిపితే ఒట్టు
గుడ్లూరు : మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం అధికారులతో మం డల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ప్రజాప్రతినిఽధులు సమస్యలపై నోరుమెదపలేదు. సమావేశం మెత్తంలో కూడా ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు మొక్కుబడి ప్రశ్నలతో సమావేశాన్ని ముగించారు. ఇక సమావేశానికి తహసీల్దార్ హాజరుకాలేదు. రెవెన్యూశాఖ తరఫున ఆర్ఐ హాజర య్యారు. దీంతో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపలేదు. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు కూడా సమయపాలన పాటించకపోవడంతో మొక్కు బడిగానే సమావేశం జరిగింది. దీంతో మండలంలో ప్రధానంగా ఉన్న నీటిసమస్య, అంతర్గతరోడ్లు, పారిశుధ్యం, వీధిదీపాలు, ఆక్రమితభూములు, సీజనల్ వ్యాధులు, కరోనా నియంత్రణ చర్యలు తదితర అంశాలపై చర్చలు ముందుకు సాగలేదు. తొలత పోట్లూరు గ్రామసర్పంచ్ పూసపాటి సుబ్బరాజు మాట్లాడుతూ.. ఎరువులు, పురుగుమందులు కోనుగోలు చేసే విషయంలో ఎరువులు అమ్మకం డీలర్లు తమ ఇష్టానుసారం చేస్తున్నారన్నారు. అనంతరం ఏవో గీతా ప్రకాష్ మాట్లాడుతూ.. అక్రమగా ఎరువులు అమ్మకాలు సాగిస్తున్న డీలర్లపై తగుచర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు కొరిశపాటి బాపిరెడ్డి, ఎంపీపీ పులి రమేష్, ఏవో గీతా ప్రకాష్ హౌసింగ్ ఏఈ గౌస్ భాషా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-31T07:22:55+05:30 IST