వీజీఎఫ్ సర్దుబాటు చేస్తేనే!
ABN, First Publish Date - 2021-12-07T08:26:13+05:30
వయబిలిటీ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్) సర్దుబాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే తప్ప కాకినాడలో ...
కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్పై తేల్చేసిన కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వమే సర్దుబాటు చేయాలని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): వయబిలిటీ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్) సర్దుబాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే తప్ప కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం సాధ్యపడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సోమవారం పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమాధానమిచ్చారు. కాకినాడలో రూ.32,901 కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 2017 జనవరి 27న ఏపీ ప్రభుత్వం గెయిల్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుని, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చాలంటే కచ్చితంగా వీజీఎఫ్ సర్దుబాటు చేయవలసిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం వీజీఎఫ్ సమకూర్చాలని సూచించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు భారీ మూలధన వ్యయం, పెట్టుబడులు అవసరం ఉంటుందని తెలిపారు. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందన్నారు. పారిశ్రామికీకరణతోపాటు రాష్ర్టానికి పన్నుల రూపంలో రాబడి పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వమే దీనిపై తగిన చొరవ చూపించాలని సూచించారు.
Updated Date - 2021-12-07T08:26:13+05:30 IST