కేంద్రం తీరుపై నిరసనల హోరు
ABN, First Publish Date - 2021-08-10T06:07:20+05:30
కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
వివిధ మండలాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు
అధికారులకు వినతులు సమర్పణ
నర్సీపట్నం అర్బన్/గొలుగొండ/ మాకవరపాలెం/ నాతవరం, ఆగస్టు 9 : కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజాసంఘాల నాయకుడు డి.సత్తి బాబు మాట్లాడుతూ రైతులకు నష్టదాయకమైన చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కోటేశ్వరరావు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే, రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గొలుగొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వామపక్షాల నాయకులు ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మాకిరెడ్డి రామునాయుడు, ఏపీ రైతు సంఘ జిల్లా నాయకుడు మేకా సత్యనారాయణ, ఎల్.రమణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.రాధాకృష్ణ, సీపీఎం నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్రంలో మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మాకవరపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది ఆందోళన నిర్వహించారు. యూనియన్ నాయకుడు వనుం శ్రీనివాసరావు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, సీఐటీయూ ఆధ్వర్యంలో నాతవరం తహసీల్దార్ కార్యాలయం ముందు సేవ్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పద్మజ, ఎంసత్యవతి, రాజేశ్వరి, లక్ష్మి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-10T06:07:20+05:30 IST