ద్వారకా తిరుమలలో ఏకాంతంగా రథయాత్ర ఉత్సవాలు
ABN, First Publish Date - 2021-07-12T19:03:50+05:30
పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ దత్త దేవాలయం అయిన సంతాన గోపాల జగన్నాథ స్వామి ఆలయంలో నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు స్వామివారి రథయాత్ర ఉత్సవాలు జరుగుతాయి.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ దత్త దేవాలయం అయిన సంతాన గోపాల జగన్నాథ స్వామి ఆలయంలో నేటి (సోమవారం) నుంచి ఈనెల 20వ తేదీ వరకు స్వామివారి రథయాత్ర ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ ఉత్సవాలను కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయితే ఈ ఆలయాన్ని ఆంధ్ర పూరిగా పిలుస్తారు. సంతానం లేని వారు జగన్నాథ స్వామి ఆలయానికి వచ్చి మొక్కుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ స్వామిని సంతాన గోపాల జగన్నాథ స్వామిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఉత్సవాల మొదటి రోజు స్వామివారి రథంపై ద్వారకా తిరుమలకు, చివరి రోజు తిమ్మాపురం గ్రామానికి ఊరేగింపుగా తీసుకు వెళ్తారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో రథయాత్ర కార్యక్రమాలను రద్దుచేశారు. స్వామివారికి జరిగే నిత్యకైంకర్యాలు ఈ ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయాన్ని 1997లో ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవాలయం దత్తత తీసుకుంది. అప్పటినుంచి అన్ని ఉత్సవాలు ద్వారకాతిరుమల దేవస్థానమే నిర్వహిస్తోంది.
Updated Date - 2021-07-12T19:03:50+05:30 IST