అభివృద్ధి పథంలో ఏపీజీవీబీ
ABN, First Publish Date - 2021-02-05T05:49:56+05:30
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ), తెలంగాణ గ్రామీణ బ్యాంక్.. దేశంలోని మిగిలిన గ్రామీణ బ్యాంక్లతో పోల్చితే వృద్థి పథంలో ముందు వరుసలో ఉన్నాయని భారతీయ
ఎస్బీఐ చైర్మన్ చైర్మన్ దినేష్కుమార్ ఖారా
హన్మకొండ(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ), తెలంగాణ గ్రామీణ బ్యాంక్.. దేశంలోని మిగిలిన గ్రామీణ బ్యాంక్లతో పోల్చితే వృద్థి పథంలో ముందు వరుసలో ఉన్నాయని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ కుమార్ ఖారా అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఏపీజీవీబీ. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ల ఖాతాదారుల కోసం ఆధార్ ఆధారిత డిజిటల్ ఇన్స్టా సేవింగ్స్ ఖాతా (డిసా) మొబైల్ యాప్ను గురువారం నాడు వర్చువల్గా ఎస్బీఐ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ, బంగారం రుణాల్లో మెరుగైన వృద్ధి, మొండి బకాయిల వసూళ్లలో మంచి పనితీరును కనబరుస్తున్నాయన్నారు.
కార్యకలాపాల విస్తరణ, ఖాతాల నిర్వహణ, నాణ్యత వంటి విషయాల్లో ఈ బ్యాంకులు మంచి ప్రగతిని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీజీవీబీ.. తెలంగాణలోని 21 జిల్లాల్లో, ఏపీలోని 5 జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్.. తెలంగాణలోని 18 జిల్లాల్లో సేవలందిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఏపీజీవీబీ చైర్మన్ కె ప్రవీణ్ కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వీ అరవింద్ పాల్గొన్నారు.
‘డిసా’ ఇలా : ఖాతాదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిసా యాప్ను డౌన్లోడ్ చేసుకుని వివరాలు పూర్తి చేసి గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాను తెరవవచ్చని ఏపీజీవీబీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆధార్ నంబర్ అనుసంధానంతో కేవలం పది నిమిషాల్లో ఈ వ్యక్తిగత ఖాతాను ప్రారంభించవచ్చని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2021-02-05T05:49:56+05:30 IST