జూన్ 1 వరకూ లాక్డౌన్ పొడిగింపు
ABN, First Publish Date - 2021-05-18T21:29:59+05:30
కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్ను మరో రెండు..
భువనేశ్వర్: కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని ఒడిశా ప్రభుత్వం మంగళవారంనాడు ప్రకటించింది. మే 19వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జూన్ 1వ తేదీ వరకూ ఈ లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపింది. వారాంతంలో పూర్తి లాక్డౌన్ ఉంటుందని, ప్రతి శుక్రవావారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకూ పూర్తి లాక్డౌన్ అమలులో ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఒడిశా ప్రభుత్వం ఈనెల 5న ప్రకటించిన రెండు వారాల లాక్డౌన్ ఈనెల 19వ తేదీతో ముగియనున్నందున రాష్ట్ర ఆరోగ్య నిపుణులు, జిల్లా అధికారులతో సంప్రదించి లాక్డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకుంది.
తాజా ఉత్తర్వుల ప్రకారం, నిత్యావసర సరకుల దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకే తెరిచి ఉంటాయి. అలాగే వివాహ కార్యక్రమాలకు వధువు, వరుడు సహా 25 మందిని మాత్రమే అనుమతిస్తామని తాజా ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. రాబోయే మూడు నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టి, అనుమానాస్పద కేసుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
Updated Date - 2021-05-18T21:29:59+05:30 IST