సుపరిపాలనలో తెలంగాణ @ 9
ABN, First Publish Date - 2021-12-26T06:50:00+05:30
కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనా ర్యాంకులను వెల్లడించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలు; వాణిజ్యం, పరిశ్రమలు; ..
10వ స్థానంలో ఆంధ్రప్రదేశ్!.. అగ్రస్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, గోవా
వాణిజ్యం, పరిశ్రమల్లో తెలంగాణ టాప్!
సాంఘిక సంక్షేమం, అభివృద్ధిలోనూ..
ఆర్థిక, ప్రజా మౌలిక
సదుపాయాల్లో రెండో ర్యాంకు
వ్యవసాయ రంగంలో ఏపీ నంబర్ 1
సుపరిపాలన సూచీ-2021ను
విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనా ర్యాంకులను వెల్లడించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలు; వాణిజ్యం, పరిశ్రమలు; మానవ వనరుల అభివృద్ధి; ప్రజారోగ్యం; మౌలిక సదుపాయాలు-సేవలు; ఆర్థిక పరిపాలన; సాంఘిక సంక్షేమం, అభివృద్ధి; న్యాయ వ్యవస్థ- ప్రజాభద్రత; పర్యావరణం; పౌర కేంద్రీకృత పాలన.. అనే 10 అంశాల్లో రాష్ట్రాలు సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనా ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 10 రంగాల్లో చూస్తే గ్రూప్-ఏలోని 10 రాష్ట్రాల్లో తెలంగాణ 4.842 స్కోరుతో 9వ స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ 4.470 స్కోరుతో అట్టడుగున నిలిచింది. తొలి మూడు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, గోవా నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. మాజీ ప్రధాని వాజ్పేయీ జయంతి సందర్భంగా డిసెంబరు 25ను ‘సుపరిపాలన దినం’గా నిర్వహిస్తున్నారు. శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘సుపరిపాలన సూచీ- 2020-21’ని విడుదల చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను నాలుగు కేటగిరీలుగా విభజించి కేంద్రం ర్యాంకులను ప్రకటించింది. ఈశాన్య, కొండ ప్రాంత రాష్ట్రాలు; కేంద్ర పాలిత ప్రాంతాలు; ఇతర రాష్ట్రాలను గ్రూప్-ఏ, గ్రూప్-బీగా విభజించింది. గ్రూప్-ఏలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, హరియాణా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని రంగాల్లో తెలంగాణ టాప్లో నిలవగా.. మరికొన్ని రంగాల్లో వెనకబడింది. వాణిజ్యం, పరిశ్రమల రంగంలో 0.699 స్కోరుతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. సాంఘిక సంక్షేమం, అభివృద్ధి రంగంలోనూ 0.617 స్కోర్తో తొలి స్థానంలో నిలిచింది. ప్రజా మౌలిక సదుపాయాల రంగంలో 0.793 స్కోర్తో 2వ స్థానంలో నిలిచింది. ఆర్థిక పరిపాలన రంగంలోనూ 0.632 స్కోరుతో రెండో ర్యాంకు సాధించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏపీ టాప్లో నిలవగా.. తెలంగాణ ఏడో స్థానంలో ఉంది.
20 రాష్ట్రాలు పుంజుకున్నాయ్..
2019నాటి సూచీతో పోలిస్తే గుజరాత్ 12 శాతం, గోవా 25 శాతం అభివృద్ధి సాధించినట్టు నివేదిక పేర్కొంది. ఇక, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ 2019 కంటే 9శాతం మెరుగైన పాలనతో అనూహ్యంగా పుంజుకుంటున్న రాష్ట్రాల జాబితాలో చేరింది. మొత్తం పది అంశాల ఆధారంగా కేటాయించిన ర్యాంకుల్లో 20 రాష్ట్రాలు బాగా పుంజుకున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్ 3.7శాతం పుంజుకోగా, మహారాష్ట్ర వ్యవసాయం, మానవ వనరుల అభివృద్ధి, సాంఘిక సంక్షేమంలో మరింత పుంజుకున్నట్లు తెలిపింది. సాంఘిక సంక్షేమం, వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాల్లో గోవా ముందంజలో ఉంది. జార్ఖండ్ కూడా 12.6 శాతం పురోగతి సాధించినట్లు నివేదిక తెలిపింది. రాజస్థాన్ మాత్రం 1.7శాతమే పుంజుకున్నట్లు వివరించింది. ఈశాన్య రాష్ట్రాల విభాగంలో మిజోరం ప్రజారోగ్యం, పరిశ్రమలు, మానవ వనరుల లభ్యత వంటి అంశాల్లో భారీగా పురోగతి సాధించినట్లు సూచీ వెల్లడించింది. అభివృద్ధిలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఆశాజనకంగానే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
Updated Date - 2021-12-26T06:50:00+05:30 IST