మల్లారెడ్డి, యాదగిరిరెడ్డిలపై లేని విచారణ ఈటలకెందుకు?
ABN, First Publish Date - 2021-05-02T12:51:57+05:30
బడుగు, బలహీన వర్గాలప్రజల హక్కులు, ఆత్మగౌరవాన్ని....
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అణగదొక్కేందుకే..
- బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు
హైదరాబాద్/రాంనగర్ : బడుగు, బలహీన వర్గాలప్రజల హక్కులు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకే మంత్రి ఈటల రాజేందర్పై భూకబ్జా పేరుతో రాజకీయ కుట్రకు పాల్పడ్డారని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు ఆరోపించారు. ఈటలపై ఎలాంటి చర్యలు తీసుకున్నా బీసీ, ఎస్సీ, ఎస్టీవర్గాల ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
శనివారం బాగ్లింగంపల్లిలోని ఓంకార్భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివా్సగౌడ్, టీఎస్ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, తెలంగాణ విశ్వబ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు కుందారం గణే్షచారి, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు రాజ్కుమార్జాదవ్లు మాట్లాడారు. రాష్ట్రంలో భూకబ్జాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులపై వచ్చిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారికి లేని విచారణ మంత్రి ఈటలకు ఎందుకని వారు ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చిన వారి ఆస్తులపై ముందుగా సీబీఐ, లేదా సిట్టింగ్ హైకోర్జు జడ్జిచే విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
బడుగు, బలహీన వర్గాలకు ప్రతినిధిగా కొనసాగుతున్న ఈటల సీఎం అయ్యే ప్రమాదం ఉందనే భయంతో పథకం ప్రకారం రాజకీయ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈటలపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వ పతనం తప్పదని వారుహెచ్చరించారు. ఈటలకు రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీల మద్దతు ఉందన్నారు. ఈ సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు రావులకోలు నరేష్, రాజేందర్, కనకాలశ్యామ్ కురుమ, బడే సాబ్, జాజుల లింగం, రంజిత్ముదిరాజ్, సతీ్షకుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2021-05-02T12:51:57+05:30 IST