చంద్రయ్య జీవితం స్ఫూర్తిదాయకం
ABN, First Publish Date - 2021-08-27T06:00:02+05:30
చంద్రయ్య జీవితం స్ఫూర్తిదాయకం
దేశభక్తుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ
భీమదేవరపల్లి, ఆగస్టు 26 : స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్య జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకమని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ శ్లాఘించారు. జాతిపిత మహ్మాతాగాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని చంద్రయ్య జైలు జీవితాన్ని గడిపారన్నారు. ఓ వైపు స్వాతంత్య్ర సమరం కోసం పోరాటం, సహకార ఉద్యమం పటిష్టం చేసేందుకు మరో పోరాటం చంద్రయ్య చేశారన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో గురువారం రాత్రి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్య విగ్రహాన్ని గవర్నర్ దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1991లో తాను ఎంపీగా ఉన్నప్పుడు స్వాతంత్య్ర సమరయోధుల సమస్యలపై కూలంకషంగా తనతో చంద్రయ్య చర్చించారన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ ఇప్పించడంలో చంద్రయ్య తీవ్రంగా కృషి చేశారన్నారు. అలాంటి చంద్రయ్య విగ్రహాన్ని ముల్కనూర్లో ఏర్పాటు చేసిన కావేరి సీడ్స్ ఎం.డి. గుండవరపు భాస్కర్రావు అభినందనీయుడన్నారు.
దేశభక్తుల జీవిత చరిత్రలను ఆయా రాష్ట్రాలోని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని దత్తాత్రేయ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకార సంఘాల పటిష్టత కోసం కొత్త సహకార చట్టాలు తీసుకువస్తున్నాడన్నారు. ఈ సహకార చట్టాలతో సహకార సంఘాలు మరింత ఆర్థికంగా బలోపేతం అవుతాయన్నారు. వ్యవసాయాధారిత పరిశ్రమలతో ఉద్యోగాల కల్పన జరుగుతుందని దత్తాత్రేయ అన్నారు. గ్రామీణ భారతంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వస్తే ఉద్యోగాల కల్పన పెద్దఎత్తున జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వెంకటయ్యను గవర్నర్ దత్తాత్రేయ శాలువాతో సత్కరించారు. పడాల చంద్రయ్య, జీవిత చరిత్రను యూరివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి ధార్న దివ్య రచించిన పుస్తకాన్ని దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ముల్కనూర్ బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జడ్పీటీసీ వంగ రవీందర్, ఎంపీపీ జక్కుల అనిత-రమేష్, మాజీ జడ్పీటీసీ బి అశోక్ముఖర్జీ, కావేరి సీడ్స్ ప్రొడక్షన్ మేనేజర్ సుమన్రావు, మాజీ ఎంపీపీ సంగ సంపత్, సర్పంచ్ మాడ్గుల కొంరయ్య, ఎంపీటీసీలు బొల్లంపల్లి రమేష్, అప్పని పద్మ, లక్ష్మీనర్సింహాచార్యులు, నవాబ్పాషా, మంగ రామచంద్రం, గద్ద సమ్మయ్య, పడాల గౌతమ్ పాల్గొన్నారు.
Updated Date - 2021-08-27T06:00:02+05:30 IST