కరెంటు బాదుడే!
ABN, First Publish Date - 2021-12-28T07:05:00+05:30
ఆర్టీసీ చార్జీలు పెంచారు! సినిమా టికెట్ ధరలు పెంచారు! ఇప్పుడు
- షాపులు, వాణిజ్య సంస్థలకు యూనిట్కు రూ.1
- పరిశ్రమలకు కూడా రూపాయి చొప్పున
- ఈఆర్సీకి తెలంగాణ డిస్కమ్ల ప్రతిపాదన
- మొత్తంగా 6,831 కోట్లు రాబట్టుకునే యోచన
- కేంద్ర విధానాలతో పెంచక తప్పట్లేదని వాదన
- ఈఆర్సీ ఆమోదిస్తే ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ చార్జీలు పెంచారు! సినిమా టికెట్ ధరలు పెంచారు! ఇప్పుడు విద్యుత్తు చార్జీలు పెంచడానికి కూడా రంగం సిద్ధమైంది! గృహ విద్యుత్తు వినియోగదారులపై (లో టెన్షన్- ఎల్టీ డొమెస్టిక్) యూనిట్కు 50 పైసలు పెంచాలని డిస్కమ్లు నిర్ణయించాయి. అలాగే, షాపులు, వ్యాపార సంస్థల వంటి వాణిజ్య వినియోగదారుల (ఎల్టీ కమర్షియల్)పై యూనిట్కు రూపాయి చొప్పున పెంచాలని ప్రతిపాదించాయి. ఫలితంగా, 1,54,91,171 మందిపై భారం పడనుంది. అలాగే, పరిశ్రమల (హై టెన్షన్- హెచ్టీ) వినియోగదారులపై యూనిట్కు రూపాయి చొప్పున చార్జీ పెంచాలని నిర్ణయించాయి. ఈ ప్రభావం 13,717 హెచ్టీ వినియోగదారులపై పడనుంది.
తాజా ప్రతిపాదనల ద్వారా.. ఎల్టీ వినియోగదారులపై ఏడాదికి రూ.2,110 కోట్లు; హెచ్టీ వినియోగదారులపై ఏడాదికి రూ.4,721 కోట్ల మేర చార్జీలు పెంచడానికి డిస్కమ్లు సిద్ధమయ్యాయి. ఈ మేరకు విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సోమవారం ప్రతిపాదనలు సమర్పించాయి. ఈఆర్సీ దీనిని ఆమోదిస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. నిజానికి, ఈనెల 27వ తేదీలోగా టారిఫ్ ప్రతిపాదనలు దాఖలు చేయకపోతే తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈఆర్సీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దాంతో, సరిగ్గా గడువుకు చివరి రోజైన సోమవారమే టారిఫ్ ప్రతిపాదనలను దాఖలు చేయాలని డిస్కమ్లు నిర్ణయించాయి. ఈ మేరకు ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు మనోహర్రాజు, బండారు కృష్ణయ్యలకు ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమా రెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాలరావు కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలు అందించారు. తమ టారిఫ్ ప్రతిపాదనల్లోనే చార్జీల పెంపునకు కారణాలను ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వివరించారు.
ప్రతిపాదనల్లో పేర్కొన్న కారణాలు ఇవీ!
గత ఐదేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదు
కరోనాతో డిస్కమ్లపై తీవ్రంగా భారం పడింది.
కేంద్రం తీసుకున్న నిర్ణయాలూ ఇందుకు కారణం.
క్లీన్ ఎనర్జీ సెస్ను టన్నుకు రూ.50 నుంచి రూ.400 వరకూ పెంచింది.
బొగ్గు కొనుగోలు వ్యయం టన్నుకు 800పెరిగింది.
రైల్వే రవాణా భారం నాలుగేళ్లలో 40ు పెరిగింది.
పెట్రోలు, డీజిల్ చార్జీల పెంపుతో మరింత భారం.
ఉద్యోగుల వేతనాలను రెండుసార్లు సవరించాం
విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి; అన్ని కేటగిరీల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడానికి రూ.34,087 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాం.
తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం ఏడాదికి 2,071 యూనిట్లకు చేరింది. అదే సమయంలో, దేశంలో తలసరి విద్యుత్తు వినియోగం 1,161 యూనిట్లు మాత్రమే.
యథావిధిగా ఉచిత, సబ్సిడీ విద్యుత్తు
విద్యుత్తు చార్జీలు పెంచినా వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీలను యథావిధిగా కొనసాగిస్తామని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఉచిత, రాయితీ పథకాలు ఇవే!
వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్తు. తద్వారా 25.78 లక్షల మంది రైతులకు లబ్ధి.
ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 101 యూనిట్ల దాకా ఉచిత కరెంట్
నాయీ బ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్
పవర్ లూమ్స్, స్పిన్నింగ్ మిల్లులు, పౌలీ్ట్ర ఫామ్లకు యూనిట్కు 2 రాయితీ
సంప్రదింపుల తర్వాతే చార్జీల పెంపు
కరెంటు చార్జీల పెంపునకు సంబంధించి డిస్కమ్లు సమర్పించిన ప్రతిపాదనలపై ఈఆర్సీ నోటీసు ఇవ్వనుంది. ఈ మేరకు రెండు రోజుల్లో రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం జరగనుంది. డిస్కమ్ల ప్రతిపాదనలపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించనుంది. ఏ మేర చార్జీలు పెంచనున్నారో తెలిపి.. రాష్ట్రంలో మూడు లేదా నాలుగు ప్రాంతాల్లో బహిరంగ విచారణ జరపనుంది. ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది.
ప్రభుత్వ సబ్సిడీ రూ.5,652 కోట్లు
వార్షిక ఆదాయ అవసరం రూ.53,054 కోట్లు
ప్రస్తుత టారి్ఫతో వచ్చే ఆదాయం రూ.36,474 కోట్లు
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.5,652
రెవెన్యూ లోటు రూ.10,928 కోట్లు
తాజా పెంపుతో వచ్చే అదనపు ఆదాయం రూ.6,831 కోట్లు
డిస్కమ్ల అంతర్గత సామర్థ్యం
పెంపుతో మిగిలే మొత్తం రూ.4097 కోట్లు
టారిఫ్ ప్రతిపాదనలు ఇలా.. (యూనిట్కు రూ.ల్లో)
ఎల్టీ డొమెస్టిక్
కేటగిరీ పాత చార్జీ కొత్త చార్జీ
ఎల్టీ 50 యూనిట్లలోపు 1.45 1.95
51-100 యూనిట్లలోపు 2.60 3.10
ఎల్టీ -1(బీ)(1) (100 - 200 యూనిట్ల వరకు)
0-100 3.30 3.80
101-200 4.30 4.80
ఎల్టీ - 1 (బీ)(2) (200 యూనిట్లపైన)
0-200 5.00 5.50
201-300 7.20 7.70
301-400 8.50 9.00
401-800 9.00 9.50
800 యూనిట్లపైన 9.50 10.00
ఎల్టీ నాన్ డొమెస్టిక్- కమర్షియల్
ఎల్టీ 2ఏ 50 యూనిట్ల వరకూ
0-50 యూనిట్లు 6.00 7.00
ఎల్టీ 2బి - 50 యూనిట్లపైన వాడేవారికి
0-100 యూనిట్లు 7.50 8.50
100-300 యూనిట్లు 8.90 9.90
301-500 యూనిట్లు 9.40 10.40
500 యూనిట్లపైన 10.00 11.00
హెచ్టీ ఇండస్ట్రీ
జనరల్ (11కేవీ) 6.65 7.65
33 కేవీ 6.15 7.15
132కేవీ 5.65 6.65
పారిశ్రామికవాడలు 6.30 7.30
సీజనల్ పరిశ్రమలు 7.60 8.60
కేటగిరీ ప్రస్తుతం వస్తున్న ఆదాయం
ఎల్టీ-1 డొమెస్టిక్ రూ.4938.34 కోట్లు
ఎల్టీ-2 నాన్ డొమెస్టిక్/కమర్షియల్ రూ.3224.87 కోట్లు
ఎల్టీ-3 ఇండస్ట్రీయల్ రూ.825 కోట్లు
ఎల్టీ-4 కుటీర పరిశ్రమలు, ఽధోబీఘాట్ రూ.7.44 కోట్లు
ఎల్టీ-6 స్థానిక సంస్థలు, వీధిదీపాలు రూ.610.31 కోట్లు
ఎల్టీ-7 సాధారణ అవసరాలు రూ.90.84 కోట్లు
హెచ్టీ-1 (11 కేవీ) రూ.5685.25 కోట్లు
హెచ్టీ-1(33 కేవీ) రూ.3477 కోట్లు
హెచ్టీ-1(132 కేవీ) రూ.4928.18 కోట్లు
Updated Date - 2021-12-28T07:05:00+05:30 IST