తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన ఐసెట్
ABN, First Publish Date - 2021-08-20T09:36:01+05:30
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన టీఎస్ ఐసెట్ - 2021 ఆన్లైన్ పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ప్రారంభమైన ఈ పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 85శాతం మంది హాజరు
ప్రశ్నపత్రాన్ని విడుదల చేసిన ప్రొఫెసర్ పాపిరెడ్డి, కేయూ వీసీ రమేశ్
కేయూ క్యాంపస్, ఆగస్టు 19: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన టీఎస్ ఐసెట్ - 2021 ఆన్లైన్ పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ప్రారంభమైన ఈ పరీక్షలు శుక్రవారం కూడా జరగనున్నాయి. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ (కేయూ) ఐసెట్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేయూలోని ఐసెట్ కార్యాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, కేయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రమేశ్ ఆన్లైన్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మొదటి సెషన్ పరీక్ష జరిగింది. దీనికి 22,018 మంది దరఖాస్తు చేసుకోగా, 18,107 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహించారు.
దీనికి 22,018 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 19,198 మంది పరీక్ష రాశారు. మొత్తమ్మీద 85శాతం మంది పరీక్షలకు హాజరైనట్లు ఐసెట్ అధికారులు వెల్లడించారు. కిషన్పురలోని సీడీసీ, కిట్స్, వాగ్దేవి, రామప్ప కాలేజీలకు వెళ్లి అక్కడ పరీక్షలు జరుగుతున్న తీరును వీసీ ప్రొఫెసర్ రమేశ్, రిజిస్ట్రార్ బి.వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఐసెట్ మూడో సెషన్ పరీక్షలు జరగనున్నాయి.
Updated Date - 2021-08-20T09:36:01+05:30 IST