మద్యం మత్తులో ఉప రాష్ట్రపతి కాన్వాయ్ డ్రైవర్.. ఇన్నోవా ఢీకొని హోంగార్డుకు గాయాలు
ABN, First Publish Date - 2021-12-08T08:58:05+05:30
ఉప రాష్ట్రపతి ప్రోటోకాల్ కాన్వాయ్లోని ఓ వాహన డ్రైవరు మద్యం మత్తు.. ఓ హోంగార్డు ప్రాణాల మీదకు తెచ్చింది.
శంషాబాద్ విమానాశ్రయంలో ఘటన
శంషాబాద్ రూరల్, డిసెంబరు 7 : ఉప రాష్ట్రపతి ప్రోటోకాల్ కాన్వాయ్లోని ఓ వాహన డ్రైవరు మద్యం మత్తు.. ఓ హోంగార్డు ప్రాణాల మీదకు తెచ్చింది. తప్పతాగిన ఆ డ్రైవర్ వేగంగా దూసుకు రావడంతో ఆ హోంగార్డుకు తీవ్రగాయాలయ్యాయి. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈ నెల 9, 10 తేదీల్లో శంషాబాద్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది మంగళవారం విమానాశ్రయంలో రిహార్సల్స్ నిర్వహించారు. ఈ సమయంలో శంషాబాద్ మండలం ఘన్సీమియాగూడకు చెందిన హోంగార్డు అశోక్ ఎయిర్పోర్టులోని రోటరీ-2 వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఉప రాష్ట్రపతి భద్రతా సిబ్బంది ప్రోటోకాల్ కాన్వాయ్లో ఉన్న ఇన్నోవా కారు డ్రైవర్ మహ్మద్ తాజుద్దీన్ మద్యం మత్తులో వేగంగా దూసుకొచ్చి అశోక్ను ఢీకొన్నాడు. తీవ్ర గాయాలైన అశోక్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తాజుద్దీన్ బ్రీత్ ఎనలైజ్ చేయగా 78 పాయింట్లుగా తేలిందని సీఐ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2021-12-08T08:58:05+05:30 IST