ప్రాణహితకు తగ్గిన ప్రవాహం
ABN, First Publish Date - 2021-06-23T05:17:08+05:30
ప్రాణహితకు తగ్గిన ప్రవాహం
మహదేవపూర్ రూరల్, జూన్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాణాధారమైన ప్రాణహిత నది ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. వారం రోజుల క్రితం ఉప్పొంగిన ఈ నది ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కాళేశ్వరం వద్ద నెమ్మదించింది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోకి ఇన్ఫ్లో మంగళవారం తగ్గుముఖం పట్టింది. గోదావరి ద్వారా మేడిగడ్డ బ్యారేజీలోకి వచ్చే 17,620 క్యూసెక్కుల ఇన్ఫ్లోతో పాటు అదనంగా బ్యారేజీలో నిల్వ ఉన్న మరో 5480క్యూసెక్కుల నీటిని కన్నెపల్లి పంప్హౌజ్లోని 11 మోటార్ల ద్వారా 23,100 క్యూసెక్కుల (2టీఎంసీలు) నీటిని అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 10.62 టీఎంసీల నీరు నిల్వ ఉండగా బ్యారేజీ ఒకే ఒక్క గేటును ఎత్తి దిగువకు 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. నీటిమట్టం 98.10మీటర్లు నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అన్నారం బ్యారేజీలో మంగళవారం 9.35 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఎగువన ఉన్న అన్నారం పంప్హౌజ్ నుంచి 20,510 క్యూసెక్కుల నీటిని సుందిళ్ల బ్యారేజీలోకి ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Updated Date - 2021-06-23T05:17:08+05:30 IST