కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులు చేపడితే ప్రభుత్వంతో యుద్ధమే
ABN, First Publish Date - 2021-08-11T05:08:29+05:30
అదనపు టీఎంసీ కాలువ పనులు చేపడితే ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతామని ఎమ్మెల్సీ టి జీవన్రెడ్డి అన్నారు.
-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
గంగాధర, ఆగస్టు 10: అదనపు టీఎంసీ కాలువ పనులు చేపడితే ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతామని ఎమ్మెల్సీ టి జీవన్రెడ్డి అన్నారు. గంగాధర వరద కాలువపై అదనపు టీఎంసీ తరలింపులో భూములు కోల్పోతున్న వివిధ గ్రామాల రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జీవన్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర జలవనరుల శాఖ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అదనపు టీఎంసీ నీటిని తరలించడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి 20 వేల కోట్ల అదనపు భారం పడేలా రాష్ట్ర ప్రభుత్వం మూడో టీఎంసీ కాలువ నిర్మాణం చేపడతోందన్నారు. కాలువ నిర్మాణంతో రైతులు భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు. గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల భూముల విలువలను పెంచడానికి చొప్పదండి నియోజకవర్గ రైతుల పొట్టగొట్టడానికి సీఎం కేసీఆర్ యత్నించడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి నియోజకవర్గ ఇన్ చార్జి మేడిపల్లి సత్యం, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సుగుణాకర్రావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-11T05:08:29+05:30 IST