పత్తి ధర పైపైకి..
ABN, First Publish Date - 2021-12-31T05:50:28+05:30
పత్తి ధర పైపైకి..
ఖమ్మం మార్కెట్లో క్వింటా రూ.9,100
జూలూరుపాడులో రూ.9050 పలికిన తెల్లబంగారం
మరింత పెరగొచ్చని వ్యాపారుల అంచనా
ఖమ్మం మార్కెట్/జూలూరుపాడు, డిసెంబరు 30: దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో తెల్లబంగారం ధర పరుగులు పెడుతోంది. ఈ సీజన్లోనే అత్యధికంగా గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తిని రూ.9,100లకు ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా వ్యాపారులు కొనుగోలు చేశారు. పత్తికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర రూ.6,025 ఉండగా.. అంతకన్నా ఎక్కువగా.. గత రెండు రోజులు వరుసగా క్వింటా రూ.9,000కు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో గురువారం క్వింటాకు మరో రూ.100 పెంచి కొన్నారు. రానున్న రోజుల్లో క్వింటా పత్తి రూ.10వేల వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ ఏడాది పత్తిసాగు తగ్గడంతో పాటు వాతావరణ పరిస్థితులతో దిగుబడి కూడా తగ్గడంతో పత్తికి డిమాండ్ పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పత్తి ధర పెరుగుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మార్కెట్కు సుమారు 5 వేల పత్తి బస్తాలు అమ్మకానికి రాగా.. కొనుగోళ్లను మార్కెట్ చైర్పర్సన్ డౌలే లక్ష్మీప్రసన్న, సెక్రెటరీ రుద్రాక్షి మల్లేశం, అసిస్టెంట్ సెక్రెటరీ రాజేంద్రప్రసాద్, యూడీసీ శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షించారు. ఇక భద్రాద్రి జిల్లా జూలూరుపాడు ఉపమార్కెట్ యార్డులో గురువారం క్వింటా పత్తి గరిష్ఠంగా రూ.9050 పలికింది.
Updated Date - 2021-12-31T05:50:28+05:30 IST