రైతులను రోడ్డు పాలు చేస్తున్న సీఎం
ABN, First Publish Date - 2021-11-24T05:21:22+05:30
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో తరలించక సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులను రోడ్డుపాలు చేస్తున్నదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి
మెదక్ అర్బన్, నవంబరు 23 : కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో తరలించక సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులను రోడ్డుపాలు చేస్తున్నదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మెదక్ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. వడ్లు మార్కెట్కు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదంటూ జగ్గారెడ్డితో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయన్నారు. లారీల కొరతపై మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమే్షతో ఫోన్లో మాట్లాడి ఆరాతీశారు. రేపటిలోగా లారీలు అందుబాటులో ఉంచుతామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతులకు వివరించారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మామిళ్ల అంజనేయులు, రాష్ట్ర నాయకులు మ్యాడం బాలకృష్ణతోపాటు నాయకులు ఉన్నారు.
Updated Date - 2021-11-24T05:21:22+05:30 IST