ఓటరు జాబితాకు ప్రజాప్రతినిధులు సహకరించాలి
ABN, First Publish Date - 2021-11-03T05:10:42+05:30
ఓటరు జాబితా నవీకరణకు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు సహకరించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి కోరారు.
18 ఏళ్లు నిండిన వారందరూ నమోదు చేసుకోవాలి
సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి
సంగారెడ్డిరూరల్, నవంబరు 2: ఓటరు జాబితా నవీకరణకు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు సహకరించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి కోరారు. సంగారెడ్డి కలెక్టరేట్లో వివిధ పార్టీల ప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలు బూత్స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. తప్పులు లేని ఓటరు జాబితాలను నవీకరించేందుకు సహకరించాలన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2022లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఈనెల 1న ప్రకటించామని, 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని, ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఈనెల 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వీరారెడ్డి తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను, కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించి జనవరి 5, 2022న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారని వీరారెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ముఖ్య ఘట్టం ఓటరు జాబితాలేనని, ఆన్లైన్ ద్వారా ఎప్పుడూ నమోదు చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. ఓటరు జాబితాల సవరణలకు బూత్స్థాయి అధికారులను నియమించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు బూత్స్థాయి ఏజెంట్లు కూడా పాల్గొని ఓటరు నమోదుకు సహకరించాలని తెలిపారు. తాజా ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కోరారు.
గ్రామాల్లో దండోరా వేసి ప్రజలకు తెలపాలి
ప్రత్యేక క్యాంపెయిన్ రోజుల్లో అన్ని గ్రామాల్లో ముందుగా దండోరా వేయించి ప్రజలకు తెలియజేయాలని వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కోరారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో బూత్స్థాయి అధికారుల వద్ద ఆయా దరఖాస్తులు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డీఆర్వో రాధికారమణి, ఆర్డీవోలు అంబదాస్, మెంచు నగేష్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఉమర్పాషా, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-03T05:10:42+05:30 IST