సర్వేపై శిక్షణ ఇవ్వడం అభినందనీయం
ABN, First Publish Date - 2021-04-12T05:44:36+05:30
సర్వేపై శిక్షణ ఇవ్వడం అభినందనీయం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తొర్రూరు, ఏప్రిల్ 11 : విశ్రాంత ఇంజనీర్లు ట్రస్టు ఏర్పాటు చేసుకుని డిజిటల్ సర్వేపై శిక్షణ ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం పట్టణకేంద్రంలోని వందేమాతరం ఫౌండేషన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడకు చెందిన విశ్రాంత ఇంజనీర్లు కిట్స్ ట్రస్టు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్షి్పలు ఇవ్వడం, గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని మంత్రి అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు చేస్తన్న కృషిని కొనియాడారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 మంది విద్యార్థులకు 40 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడం గొప్ప విషయం అన్నారు. మన రాష్ట్రంలో భూసర్వే నిజాం కాలంలో జరిగిందని, సీఎం కేసీఆర్ సాహసం చేసి తిరిగి భూ సర్వే చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ట్యాంపరింగ్, తప్పుడు కొలతలు లేకుండా డ్రోన్ ద్వారా ప్రభుత్వం సర్వే చేపడుతుందని, దీని కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించిందన్నారు. ధరణి నిర్వహణ కోసం రూ. 47.68 కోట్లు కేటాయించారని, భూసర్వేతో చాలా సమస్యలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్రాంత ఇంజనీర్లు రూ.40 లక్షల విలువైన కంప్యూటర్లు, డిజిటల్ థియో డైలైట్ పరికరాలు ఉచితంగా అందించడం సంతోషంగా ఉందన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు మంత్రి సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కిట్స్ విశ్రాంత ఇంజనీర్లు ప్రశాంత్ రావు, సంస్థ నిర్వాహకులు రవీంద్ర, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
పూలే ఆశయాలను కొనసాగించాలి
మహాత్మ జ్యోతి రావుఫూలే ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఫూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల చైతన్యం కోసం ఫూలే చేసిన సేవలను కొనియాడారు. ఫూలే జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గుండాల నర్సయ్య, కార్యదర్శి వెంకట్, ఎంపీపీ టీసీ అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మునిసిపల్ చైర్మన్ రాంచంద్రయ్య, కమిటీ కోఆర్డినేటర్ సోమారపు ఐలయ్య, ఎన్. కొమురయ్య, కమిషనర్ బాబు, తహసీల్దార్ రాఘవ రెడ్డి, సీఐ కరుణాకర్, డాక్టర్ సోమేశ్వర్ రావు చైర్మన్ రాంచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2021-04-12T05:44:36+05:30 IST