ఆడశిశువు దత్తత
ABN, First Publish Date - 2021-02-05T05:47:12+05:30
నిబంధనలకు విరుద్ధంగా దత్తత ఇచ్చిన చిన్నారిని అంగన్వాడీ సిబ్బంది తల్లి ఒడికి చేర్చారు.
పోలియో చుక్కలు వేద్దామని వెళితే వెలుగులోకి
తల్లిఒడికి చేర్చిన అంగన్వాడీ సిబ్బంది, పోలీసులు
గరిడేపల్లి / గరిడేపల్లి రూరల్, ఫిబ్రవరి 4 : నిబంధనలకు విరుద్ధంగా దత్తత ఇచ్చిన చిన్నారిని అంగన్వాడీ సిబ్బంది తల్లి ఒడికి చేర్చారు. ఈ ఉదంతం గరిడేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. అంగన్ వాడీ సూపర్వైజర్ రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం గారకుంటతండా గ్రామానికి చెందిన గుగులోతు కాంతారావు భార్య పరమేశ్వరి జనవరి 25న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో మూడో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమాచారం అంగన్వాడీ సిబ్బందికి గ్రామస్థుల ద్వారా చేరింది. జనవరి 31న అంగన్వాడీ టీచర్ పసిపాపకు పోలియో చుక్కలు వేసేందుకు వెళ్లగా, ఇక్కడ లేదని తల్లిదండ్రులు పలు కారణాలు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన ఐసీడీఎస్, అంగన్వాడీ సిబ్బంది పాప కనిపించకపోవడంపై పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాప తల్లిదండ్రులను విచారించిన పోలీసులు మండలంలోని గానుగబండ గ్రామానికి చెందిన దంపతులకు పాపను దత్తత ఇచ్చినట్లు తెలుసుకున్నారు. వెంటనే దత్తత తీసుకున్న వారి నుంచి పసిపాపను గురువారం తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎవరైనా దత్తత తీసుకోవాలంటే సీడబ్ల్యూసీ నిబంధనల పాటించాలని అంగన్వాడీ సూపర్ వైజర్ రమాదేవి అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జి.కైక, సుగుణ, చైల్డ్ ప్రొటెక్షన్ సిబ్బంది సాయిలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-02-05T05:47:12+05:30 IST