పరకాల ఎమ్మెల్యేపై ఓయూ విద్యార్థుల ఫిర్యాదు
ABN, First Publish Date - 2021-02-05T07:49:09+05:30
ఎస్సీ, ఎస్టీ, బీసీలను కించపరిచే విధంగా మాట్లాడిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు...
ఉప్పల్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీలను కించపరిచే విధంగా మాట్లాడిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్, టీపీసీసీ కార్యదర్శి దుర్గం భాస్కర్, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల లింగస్వామి మాట్లాడుతూ రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందిన వారికి చదువు రాదని.. వారికి తెలివితేటలు లేకపోవడంతో రాష్ట్రం మొత్తం నాశనం అవుతోందని వరంగల్ బహిరంగ సభలో ఎమ్మెల్యే వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి ఆయన విఘాతం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మీద గౌరవం లేని వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగడానికి అనర్హులని.. ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించాలని వారు కోరారు.
Updated Date - 2021-02-05T07:49:09+05:30 IST