ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
ABN, First Publish Date - 2021-05-31T04:35:01+05:30
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
- డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డి
పరిగి: రైతులు పండించిన వరిఽధాన్యాన్ని కొనుగోలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డి విమర్శించారు. ఆదివారం పరిగి పరిధిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులతో మాట్లాడారు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రాంభించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎక్కడా సరిగ్గా కొనసాగడం లేదన్నారు. బ్యాగులుంటే, ట్రాన్స్పోర్టు ఉండదు, ట్రాన్స్పోర్టు ఉంటే కొనుగోళ్లు చేయని పరిస్థితి ఉందని విమర్శించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లోని కేంద్రాల్లో బ్యాగ్లు లేక కొనుగోళ్ళు నిలిపివేశారని తెలిపారు. పొలాల వద్ద ధాన్యాన్ని పోసుకుని పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. వర్షాలు కురిస్తే కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కరోనా కల్లోల పరిస్ధితుల్లో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆచరణలో చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అధికారులు స్పందించి కొనుగోళ్ళను వేగవంతం చేయాలని కోరారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ, మల్లేశ్ పాల్గొన్నారు.
బాలాజీ రైస్ మిల్లును సందర్శించిన ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
తాండూరు: యాలాల మండల పరిధిలోని బాలాజీ రైస్ మిల్లును తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ వర్గంలో మిగిలిపోయిన వరి ధాన్యం నిల్వ చేసే విషయమై ఎమ్మెల్యే మిల్లర్లతో చర్చించారు. డీసీఎంఎస్ అధికారులకు రైస్ మిల్లర్లు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా చేస్తాం
కులకచర్ల: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి ఉమ్మడి జిల్లాలోని మిల్లర్లతో మాట్లాడినట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి తెలిపారు. ఆదివారం చౌడాపూర్, అడవి వెంకటాపూర్, కుస్మసముద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతుల చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రోజూ లారీల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తున్నామని, ఖాళీ బస్తాలు తెప్పించామని, రైతులకు ఇక ఇబ్బందులు ఉండవని తెలిపారు. అనంతరం చౌడాపూర్లో నూతనంగా ఏర్పాటు కానున్న తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్నాయక్, సొసైటీ ఉపాధ్యక్షుడు నాగరాజు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాంలాల్నాయక్, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2021-05-31T04:35:01+05:30 IST