300కోట్లకు ఆర్టీసీ స్థలాల తాకట్టు!
ABN, First Publish Date - 2021-10-31T08:29:54+05:30
కార్మికులకు బకాయిలు చెల్లించేందుకు ఇప్పటికే రూ.వెయ్యి కోట్లకుపైగా జాతీయ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న ./..
హైదరాబాద్, అక్టోబరు30 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు బకాయిలు చెల్లించేందుకు ఇప్పటికే రూ.వెయ్యి కోట్లకుపైగా జాతీయ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న ఆర్టీసీ తాజాగా నగరంలోని బస్ డిపోలకు సంబంధించిన ఆస్తులను తాకట్టుపెట్టి రూ.300 కోట్ల వరకు రుణాలు పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతి నెలా 1వ తేదీనే కార్మికులకు వేతనాలను చెల్లించేందుకు బ్యాంకులతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. టికెట్ల విక్రయం ద్వారా వేతనాల చెల్లింపులకు అవసరమైన నిధులు సమకూరకపోవడంతో.. ఓడీ (ఓవర్ డ్రాఫ్ట్)ని వినియోగించుకుని చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ, కొన్ని నెలలుగా ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల నుంచి 7 శాతంగా మినహాయించిన నిధులు సీసీఎస్ (ఆర్టీసీ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ)లో జమ చేయకపోవడంతో రూ.1150 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి.
రెండేళ్లుగా సీసీఎస్ నుంచి కార్మికులు రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. దీంతో.. ఎండీ సజ్జనార్ బకాయిల సర్దుబాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి విడతగా ఆర్టీసీ రూ. 90 కోట్లు ఆ తర్వాత రూ.110కోట్లు విడుదల చేసింది. అలాగే ఎన్సీడీసీకి రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు ద్వారా సీసీఎ్సకు రూ.500 కోట్లు రుణంగా ఇప్పించేందుకు ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో రుణం విడుదలకు ఎన్సీడీసీ నిరాకరించినట్టు తెలిసింది. దీంతో మళ్లీ సీసీఎస్ బకాయిల కోసం కార్మికులు ఆర్టీసీ యాజమాన్యంపై ఒత్తిడి పెంచారు. చివరకు ముషీరాబాద్, బర్కత్పురా డిపో స్థలాలను తాకట్టు పెట్టి రూ.300 కోట్లు రుణం పొందడానికి బ్యాంకులతో సంప్రదించి ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది.
Updated Date - 2021-10-31T08:29:54+05:30 IST