ఏసీబీకి చిక్కిన లంచావతారులు
ABN, First Publish Date - 2021-11-02T08:05:03+05:30
భూ సర్వే నివేదికను ఇవ్వడానికి లంచం తీసుకుంటూ సంగారెడ్డిలో ఇద్దరు, కారు అద్దె బిల్లులు చెల్లించేందుకు డబ్బులు తీసుకుంటూ నిజామాబాద్లో మరో అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు.
సంగారెడ్డిలో ఏడీ, జూ. అసిస్టెంట్, నిజామాబాద్లో ఏవో అరెస్టు
సంగారెడ్డి క్రైం, పెద్దబజార్, నవంబరు 1: భూ సర్వే నివేదికను ఇవ్వడానికి లంచం తీసుకుంటూ సంగారెడ్డిలో ఇద్దరు, కారు అద్దె బిల్లులు చెల్లించేందుకు డబ్బులు తీసుకుంటూ నిజామాబాద్లో మరో అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. సంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన మహిళ తనకున్న ఎకరా 29 గుంటల భూమికి సర్వే చేయాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖకు దరఖాస్తు చేసుకోగా, 2021 సెప్టెంబరులో అధికారులు సర్వే చేశారు. అయితే సర్వేనివేదిక ఇవ్వాలంటే తమకు రూ.20వేలు ఇవ్వాలని ఏడీ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ ఆసి్ఫ డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సోమవారం ఆమె రూ.20వేలు ఆసిఫ్, మధుసూదన్కు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు వారిద్దరినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అలాగే, నిజామాబాద్కు చెందిన సమీర్ హైమాద్ తన కారును ఏడాది క్రితం డీఎంహెచ్వో కార్యాలయంలో అద్దెకు పెట్టారు. తనకు రావాల్సిన బిల్లుల కోసం 8నెలలుగా తిరుగుతూ.. ఏవో శోభినాయక్ను సంప్రదించారు. బిల్లులు రావాలంటే తనకు రూ.20వేలు ఇవ్వాలని శోభి డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు సోమవారం శోభినాయక్కు కార్యాలయంలోనే హైమాద్ రూ.15 వేలు లంచం ఇస్తుండగా అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Updated Date - 2021-11-02T08:05:03+05:30 IST