పిచ్చివాగుడు కట్టిపెట్టు
ABN, First Publish Date - 2021-05-02T07:21:59+05:30
‘కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం గురించి ప్రపంచ మీడియా ఏం అంటున్నదో చూడు. అప్పుడు అర్థమవుతుంది.
బండి సంజయ్పై తలసాని ధ్వజం
హైదరాబాద్, మే 1(ఆంధ్రజ్యోతి): ‘కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం గురించి ప్రపంచ మీడియా ఏం అంటున్నదో చూడు. అప్పుడు అర్థమవుతుంది. గాలి మాటలు మాట్లాడటం ఎవరికైనా సాధ్యమే. ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉంటే బాధ్యతలు తెలిసుండేవి. పిచ్చివాగుడు మాని.. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకుంటే మంచిగుంటది’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో శనివారం మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్, వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్న బండి సంజయ్.. దేశంలో ఏం జరుగుతుందో ఒకసారి కేంద్రాన్ని అడిగితే తెలుస్తుందన్నారు. ‘హెల్త్ డిపార్ట్మెంట్లో పైసలు బాగున్నాయని చెప్పి ఆ శాఖను సీఎం కేసీఆర్ దగ్గర పెట్టుకున్నడని బండి సంజయ్ మాట్లాడుతున్నడు. ఇంత చిల్లరగా ఒక రాజకీయ నేత మాట్లాడవచ్చా? కరోనా విపత్తు తొలిసారి వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ప్రధానిపై కామెంట్లు చేస్తే సీఎం కేసీఆర్ సీరియస్ అయింది చూశాం. బాధ్యత అంటే అదీ’ అన్నారు. బండి సంజయ్ ఏమన్నా సత్యహరిశ్చంద్రుడా..? పాసింగ్ కామెంట్లు కాకుండా ఆధారాలతో విమర్శలు చేయాలన్నారు. ‘‘నువ్వు మొగోనివి, మనిషివైతే.. నేను 380 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లుగా నిరూపించు. నీ సమక్షంలోనే ఆ భూమిని పేదలకు పంచుతా’’ అంటూ సంజయ్కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్రాజు సవాల్ విసిరారు.
Updated Date - 2021-05-02T07:21:59+05:30 IST