విశాఖ వస్తాం..మద్దతు ఇస్తాం
ABN, First Publish Date - 2021-03-11T07:33:02+05:30
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నూరుశాతం అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నంపై ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటానికి టీఆర్ఎస్ తరఫున మద్దతు తెలుపుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
అవసరమైతే ఉద్యమంలో పాల్గొంటాం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి
ప్రభుత్వాలనూ ప్రైవేటుపరం చేస్తామంటారు
తెలంగాణ పోరాటాల్లో ఏపీ కూడా కలిసిరావాలి
ప్రైవేటు స్కూళ్ల సమస్యల్ని పరిష్కరిస్తాం: కేటీఆర్
విద్యుత్తు ఉద్యోగులతో మాది పేగు బంధం
ప్రైవేటు స్కూళ్లు, విద్యుత్తు ఇంజనీర్లతో భేటీలు
హైదరాబాద్ సిటీ/ఖైరతాబాద్/మేడ్చల్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నూరుశాతం అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నంపై ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటానికి టీఆర్ఎస్ తరఫున మద్దతు తెలుపుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతితో ఉద్యమంలో కూడా పాల్గొంటామని తెలిపారు. బుధవారం జలవిహార్లో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాలల కరస్పాండెంట్లు, టీచర్లతో ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక సమావేశంలో, మేడ్చల్లో తెలంగాణ విద్యుత్తు ఇంజనీర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే చెప్పినరు. తెలంగాణలోని బయ్యారంలో స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ద్వారా ఒక ఉక్కు కర్మాగారం పెడతం.
వేల మందికి ఉపాధిఅవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పడేం చేస్తున్నరు.. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని మన సోదరులు అక్కడ పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని వందశాతం అమ్మేసే ప్రయత్నం చేస్తున్నరు. అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నరు. వారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్న. మీకు మేమందరం నైతికంగా అండగా ఉన్నాం. అవసరమైతే కేసీఆర్ అనుమతి తీసుకొని వైజాగ్కు వచ్చి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతాం. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నరు. రేపు బీహెచ్ఈఎల్ అమ్ముతరు.. ఎల్లుండి సింగరేణి అమ్ముతరు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకూ వీటిని కూడా ప్రైవేట్పరం చేయమంటరు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మే క్రమంలో తెలంగాణలో ఏమైనా జరిగినా ఏపీ సోదరులు మాతో కలిసి రావాలని కోరుతున్నాం’’ అని కేటీఆర్ అన్నారు.
రాంచందర్రావు కేంద్రాన్ని ప్రశ్నించాలి..
నీతీ ఆయోగ్ కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణలో మిషన్ భగీరథ కోసం 24వేల కోట్లు ఇవ్వాలని సూచించినా ఇవ్వకపోవడంపై బీజేపీ అభ్యర్థి రాంచందర్రావు కేంద్రాన్ని ప్రశ్నించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతుక మాత్రమే కాకుండా పరిష్కరింపజేసే గొంతుక అయిన సురభి వాణీదేవికి అందరూ మద్దతు తెలపాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలకు మునిసిపల్ పన్ను, విద్యుత్తు బిల్లుల అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల్లో సమస్యలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించారని, ఇంతలో కరోనా చేదు అనుభవం వల్ల ప్రైవేటు సంస్థలకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయని అన్నారు. పాఠశాలలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయని, ప్రభుత్వం తరఫున వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, సురభి వాణీదేవి, నిర్వాహక సంస్థ అధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సయీద్ అహ్మద్, ఎం.రఘు తదితరులు పాల్గొన్నారు.
నాడు కరెంట్ ఉంటే వార్త... నేడు కరెంట్ పోతే వార్త
‘‘తెలంగాణ ఏర్పడక ముందు పల్లెల్లో కరెంటు ఉంటే వార్త.. నేడు కరెంటు పోతే వార్త. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్తు ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. సీఎం కేసీఆర్ మిమ్మల్నందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటారు. మనది పేగు బంధం’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో తెలంగాణ విద్యుత్తు ఇంజనీర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమానికి సాటి తెలుగువారిగా మనం సంఘీభావం ప్రకటించాలన్నారు. బీజేపీ వారు మతకల్లోలాలు సృష్టించడం తప్ప చేసేదేమీ లేదన్నారు. విద్యుత్తు ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, మింట్ కాంపౌండ్ వద్ద విద్యుత్తు భవనాన్ని కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు ఆత్మ విమర్శ చేసుకుని టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గె లిపించాలని కోరారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివాజీ, ప్రదాన కార్యదర్శి రామేశ్వర్శెట్టి, మేడ్చల్ ఏడీఏ తుల్జారాంసింగ్, మునిపల్ చైర్పర్సన్ దీపిక తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-11T07:33:02+05:30 IST