Breaking : నారా లోకేష్తో ఆనం కుమార్తె భేటీ.. వైసీపీలో హాట్ టాపిక్
ABN, First Publish Date - 2022-05-28T19:46:29+05:30
టీడీపీ మహానాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది..

ఒంగోలు : టీడీపీ మహానాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం నెల్లూరు జిల్లాతో పాటు అధికార వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో.. వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చిన కైవల్య.. లోకేష్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని లోకేష్కు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. లోకేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టీడీపీ కండువా కప్పుకోవాలని కైవల్యారెడ్డి భావిస్తున్నట్లు తెలియవచ్చింది.
అయితే.. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ టీడీపీ నాయకురాలు విజయమ్మకు కైవల్యారెడ్డి కోడలు. విజయమ్మ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. అయితే కోడలిని కూడా పార్టీలోకి తీసుకురావాలని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులకు టికెట్టు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయాన్ని టీడీపీ సంప్రదాయంగా కొనసాగిస్తోంది. మరి ఆత్మకూరు విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వైసీపీ ఇలా.. బీజేపీ అలా..!
మేకపాటి గౌతమ్రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు ఉపఎన్నిక జరుగుతోంది. ఈ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 23న ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 6న నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 23న పోలింగ్, 26న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా.. గౌతమ్రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన తమ్ముడు మేకపాటి విక్రమ్రెడ్డిని వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఉప ఎన్నికలో పోటీ విషయంలో టీడీపీ అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు.. ఆత్మకూరులో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయత్వం ఇది వరకే ప్రకటించింది. మేకపాటి కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉప ఎన్నికలో పోటీ చేసి తీరుతానని మర్రిపాడు మండలానికి చెందిన బిజివేముల రవీంద్రనాథ్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ మద్దతు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
నో రియాక్షన్..
అయితే ఈ ప్రత్యేక భేటీ అటు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇటు వైసీపీలో చర్చనీయాంశమైంది. ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా, ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ కేబినెట్లో విస్తరణలో రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని భావించారు. అయితే ఆయనకు పదవి దక్కలేదు కానీ.. అదే సామాజిక వర్గానికి, అదే జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్రెడ్డిని మంత్రి పదవి వరించింది. దీంతో అప్పట్నుంచి ఆనం కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా తెలియవచ్చింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆయన కుమార్తె టీడీపీ మహానాడులో ప్రత్యక్షమవ్వడం, పైగా లోకేష్తో ప్రత్యేకంగా భేటీ కావడం పలు చర్చలకు దారితీసింది. అయితే ఈ విషయం తెలియగానే వైసీపీ అధిష్టానం నుంచి ఆనంకు ఫోన్ కాల్ కూడా వెళ్లిందని సమాచారం. ఈ భేటీపై ఇంతవరకూ ఆనం కుటుంబం నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. కాగా వైసీపీలోకి రాకమునపు ఆనం కుటుంబం టీడీపీలోనే ఉండేది. ఈ కుటుంబం నుంచి ఆనం వెంకటరమణారెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు.
Updated Date - 2022-05-28T19:46:29+05:30 IST