చెత్త రహిత పట్టణం లక్ష్యం : మున్సిపల్ కమిషనర్
ABN, First Publish Date - 2022-10-24T00:07:06+05:30
చెత్త రహిత పట్టణంగా పాలకొల్లును తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్కుమార్ తెలిపారు.
పాలకొల్లు టౌన్, అక్టోబరు 23: చెత్త రహిత పట్టణంగా పాలకొల్లును తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్కుమార్ తెలిపారు. పట్టణంలోని మొదటి డంపింగ్ యార్డు వద్ద నుంచి 7మెట్రిక్ టన్నుల పొడి చెత్తను కంప్రెస్డ్ వాహనంలో ఆదివారం ఎగుమతి చేయించి రవాణా ప్రారంభించారు. చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్ది అంటు వ్యాధులు నిరోధిస్తామన్నారు. గతంలో పురపాలక సంఘం చెత్త తరలింపుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, ప్రస్తుతం గుంటూరుకు చెందిన జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థతో ఒప్పందం మేరకు నేరుగా గుంటూరుకు చెత్తను రవాణా చేస్తామన్నారు. పట్టణంలో రోజుకు 30 నుంచి 32 టన్నుల చెత్త సేకరణ జరుగుతుందని, వాటిలో 40 శాతం పొడి చెత్త వస్తుందన్నారు. మిగిలిన చెత్తలో ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు కేటాయిస్తున్నామని, మిగిలిన తడి చెత్తను డంపింగ్ యార్డులో నిల్వ చేసి వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీకి ప్రతిపాదనలు చేశామన్నారు. పట్టణ శివారులోని 2వ డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను తొలగించేందుకు అవినాష్ ఏజన్సీస్ టెండర్ దక్కించుకుందని తెలిపారు. త్వరలో 2వ డంపింగ్ యార్డులోని చెత్తను సైతం తొలగించి చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకు పట్టణ ప్రజలు, నాయకులు సహకరించాలని కమిషనర్ ప్రమోద్కుమార్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ చెత్త తరలింపు వాహన డ్రైవర్ నమ్మి మోహన్కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2022-10-24T00:07:11+05:30 IST